శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 30 నవంబరు 2018 (19:21 IST)

శని దోషం పోయేందుకు ఏడు శనివారాల పూజ... ఎలా చేయాలి?

హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. కోరినవారికి కొంగుబంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కొలువై ఉన్న ఈ తిరుమలేశుడు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాందవుడు, అనాధ రక్షకుడు. మన జీవితంలో శని దేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తుంటాము. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చెయ్యాలి.
 
ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. ఆ శ్రీనివాసుని కృపతో పాటు శని దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ ఆడవారు చేస్తే ఏదైన సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడ నుండి చేస్తే సరిపోతుంది. మరి ఆ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
1. శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకుని వేంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్యపు పిండి, పాలు ఒక చిన్న బెల్లం ముక్క మరియు అరటి పండు వేసి కలిపి చపాతిలా చేసి దానిని ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవునెయ్యి వేసి వెలిగించాలి.
 
2. అలనాడు వైష్ణవులు ఎంతో శ్రద్దగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని , నువ్వులనూనెతో గాని దీపం వెలిగించినవారికి అష్టైశ్వర్యాలు సిద్దిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.
 
3. అలాగే శనివారం సాయంత్రం పూట వేంకటేశ్వర ఆలయం దర్శంచి నేతితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్ని తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.