మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 1 ఆగస్టు 2018 (21:13 IST)

షష్ఠీదేవి మహత్యం ఏమిటో తెలుసా?

ప్రతి శిశువునూ సొంత బిడ్డలా రక్షించే కరుణామయి షష్ఠిదేవి. ఈ తల్లి ఆదిపరాశక్తి కళాంశరూపు. ప్రకృతిమాతలో ఆరోభాగం. అందుకనే షష్ఠీదేవి అనే పేరు వచ్చింది. ఈ దేవసేన సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవేరి కూడా. ప్రతి మాసంలోనూ శుక్లషష్ఠినాడు షష్ఠిదేవికి ఉత్సవాలు జరుగుతా

ప్రతి శిశువునూ సొంత బిడ్డలా రక్షించే కరుణామయి షష్ఠిదేవి. ఈ తల్లి ఆదిపరాశక్తి కళాంశరూపు. ప్రకృతిమాతలో ఆరోభాగం. అందుకనే షష్ఠీదేవి అనే పేరు వచ్చింది. ఈ దేవసేన సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవేరి కూడా. ప్రతి మాసంలోనూ శుక్లషష్ఠినాడు షష్ఠిదేవికి ఉత్సవాలు జరుగుతాయి. ఈ తల్లికి... ఓం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహా.... అనేది మూలమంత్రం. ఈ మంత్రాన్ని లక్షసార్లు జపిస్తే మంత్ర సిద్ది జరుగుతుందని బ్రహ్మ వరం ఇచ్చినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మదేవుడి మానసపుత్రికే ఈ అమ్మ. ఆ విషయాన్ని స్వయంగా షష్ఠీదేవే ఓ సందర్బంలో చెప్పిందట. మంచితనం కలవారిని, ధర్మాత్ముల్నీ ఈ తల్లి రక్షిస్తుందట. పురాణాల ప్రకారం ఈ తల్లి మహిమ గురించిన కధ ప్రచారంలో ఉంది.
  
 
పూర్వం స్వాయంభువమనువుకు ప్రియవ్రతుడు అనే కుమారుడు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు. నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు. చాలా కాలం పాటు పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ పెద్దలు నచ్చచెప్పడంతో మాలినీ దేవిని పెళ్లాడాడు. అంత ధర్మాత్ముడైనా చాలాకాలం వరకు సంతానం కలుగలేదు. ఇతని మంచితనాన్ని గుర్తించిన కశ్యపుడు ప్రియవ్రతుడు, మాలినీదేవి దంపతులతో పుత్రకామేష్ఠి చేయించాలని సంకల్పించాడు. యాగం జరిగిన కొద్ది కాలానికి మాలినీదేవి గర్భం ధరించి ఓ శుభముహుర్తమున మగబిడ్డను ప్రసవించింది. 
 
ఆ ఆనందం క్షణకాలం కూడా నిలువలేదు. కారణం శిశవు మృతుడై పుట్టాడు. పుత్రశోకాన్ని భరించలేక మాలినీదేవి మూర్చపోయింది. ఇక చేసేదిలేక ప్రియవ్రతుడు ఆ బిడ్డను తీసుకుని స్మశానానికి వెళ్లాడు. ఆక్కడ గుండెలు పగిలేలా రోదించాడు. ఆ సమయంలో అతని జ్ఞానయోగమంతా మబ్బుపట్టిపోయింది. అలా శోకిస్తున్న ప్రియవ్రతుని ముందు చిరునవ్వులు చిందుస్తున్న ఓ దేవత ప్రత్యక్షమైంది. 
 
రాజు ఆ తల్లిని చూసి నమస్కరించి ఎవరమ్మా నీవు అని అడిగాడు. అప్పుడా తల్లి తను షష్ఠీదేవిని అని ప్రకటించింది. నీవు చేసిన మంచి పనుల వల్ల నీ జీవితంలో శోకం అనేది కొద్ది సమయం మాత్రమే ఉందని చెప్పి... మృత శిశువును చేతిలోకి తీసుకుని ప్రాణం పోసింది. అంతేకాకుండా ఆ బిడ్డ సూరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవుతాడని గొప్ప పండితుడిగా పేరు ప్రతిష్టలందుకుంటాడని భవిష్యవాణి వినిపించింది. తొలిగా ప్రియవ్రతుడే షష్టీదేవి పూజలను ప్రారంభించాడు. అలా అమ్మవారి ఆరాధనలు వ్యాప్తిలోకి వచ్చాయి.