శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: శనివారం, 13 ఆగస్టు 2016 (15:46 IST)

శ్రీకాళహస్తిలో పిఆర్ఓ విభాగం ఏం చేస్తుంది...? శివయ్యకు ఉపయోగపడుతోందా...?

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పౌరసంబంధాల కార్యాలయం (పిఆర్‌ఓ) అంటే సంస్థకు, ప్రజలకు మధ్య సంధానకర్తల్లా ఉండాలి. ప్రధానంగా మీడియాకు అవసరమైన సమాచారం ఇవ్వడం, సంస్థలో జరిగే కార్యక్రమాల గురించి మీడియా ప్రతినిధులకు తెలియజేయడం పిఆర్‌ఓ విభాగం కనీస కర్తవ్యం. అయి

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పౌరసంబంధాల కార్యాలయం (పిఆర్‌ఓ) అంటే సంస్థకు, ప్రజలకు మధ్య సంధానకర్తల్లా ఉండాలి. ప్రధానంగా మీడియాకు అవసరమైన సమాచారం ఇవ్వడం, సంస్థలో జరిగే కార్యక్రమాల గురించి మీడియా ప్రతినిధులకు తెలియజేయడం పిఆర్‌ఓ విభాగం కనీస కర్తవ్యం. అయితే శ్రీకాళహస్తీశ్వరాలయంలో పిఆర్ఓలు అంటే స్వామి దర్శనాలు చేయించే సహాయకులుగా మారిపోయారు. విఐపిలు వచ్చినప్పుడు వారికి దర్శనాలు చేయించడమే ప్రధాన బాధ్యతగా మారిపోయారు.
 
కృష్ణా పుష్కరాల్లో భాగంగా విజయవాడలో శ్రీకాళహస్తి ఆలయ నమూనా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఉద్యోగులను డిప్యుటేషన్‌పై అక్కడికి పంపారు. అయితే అక్కడ ఆలయం తరపున ఏయే కార్యక్రమాలు చేస్తున్నారన్న వివరాలు కూడా ఆలయ పిఆర్‌ఓ విభాగం వద్ద లేవు. కృష్ణా పుష్కరాల్లో శ్రీకాళహస్తి ఆలయం తరపున ఏమి చేస్తున్నారని ఏవీ తమ లేవంటున్నారు ఆ విభాగం సిబ్బంది.
 
తితిదే విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అక్కడ జరిగే అన్ని కార్యక్రమాల సమాచారం ఫోటోలు సహా తితిదే పిఆర్‌ఓ విభాగం మీడియాకు పంపుతోంది. అటు విజయవాడ మీడియాకు, ఇటు తిరుపతి మీడియాకు అందజేస్తోంది. దీనివల్ల అక్కడక్కడా రెండు చోట్లా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం ఇవేవీ పట్టించుకోలేదు. ఈ సమాచార, సాంకేతిక యుగంలో విజయవాడ నుంచి ఫోటోలు, సమాచారం తెప్పించుకోవడం, మీడియాకు పంపడం పెద్ద సమస్య కాదు. వాట్సాప్‌లో క్షణాల్లో ఫోటోలు, సమాచారం పంపే వెసులుబాటు ఉంది. పిఆర్‌ఓ విభాగం ఉద్యోగులు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళకున్నా ఇప్పటికే వెళ్ళిన ఉద్యోగుల ద్వారా ఫోటోలు, సమాచారం తెప్పించుకుని మీడియాకు అందజేయవచ్చు.. ఆ పని చేయడం లేదు. 
 
ఆ మాటకొస్తే రోజువారి కార్యక్రమాల విషయంలోను శ్రీకాళహస్తి పిఆర్‌ఓ విభాగం అంత చురుగ్గా లేదు. హుండీ లెక్కింపు, బోర్డు సమావేశం వివరాలు తప్ప మీడియాకు ఇస్తున్న సమాచారం ఏమీ లేదు. ఇటీవల కాలంలో రాహు-కేతు పూజల వివరాలు వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా పంపుతున్నారు. ఇదీ రోజూ రావడం లేదు. ఫోటోలు తీసే పనిని ప్రైవేటు స్టూడియోకు అప్పగించడం వల్ల ఈ మెయిల్స్ ద్వారా ఫోటోలు మాత్రం వస్తుంటాయి. అయితే అవి దేనికి సంబంధించినవో వివరాలు ఉండవు.
 
ఆలయంలో రోజువారీ ఉత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆలయానికి విరాళాలు అందజేసేవారు ఉంటారు. ప్రముఖులు సందర్సిస్తుంటారు. ఇలాంటి అంశాలను రోజూ ప్రెస్‌నోట్‌ రూపంలో రాసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియాకు ఈ మెయిల్‌, వాట్సాప్‌ ద్వారా పంపవచ్చు. వీటిని అన్ని ప్రాంతాల్లోని పత్రికలు, టివీలు, వెబ్ పోర్టల్స్ వార్తలుగా ఇస్తాయి. దాని వల్ల ఆలయానికి కోట్ల రూపాయల ప్రచారం వస్తుంది. ఉదాహరణకు శివయ్య అన్నదానం కథనానికి ఒక భక్తుడు విరాళం ఇస్తే ఇది పత్రికల్లో వార్తగా వస్తే ఆ భక్తుడు సంతోషిస్తాడు. ఆ వార్త స్ఫూర్తితో ఇంకొకరు విరాళం ఇవ్వడానికి ముందుకు వస్తారు. దీని ప్రాధాన్యత ఆలయ అధికారులకు అర్థమైనట్లు లేదు. ఆలయంలో తగినంత మంది సిబ్బంది లేదని తప్పించుకోవచ్చు. ఇదంతా ఓ గంట పనిచేస్తున్న ఉద్యోగుల్లోనే ఒకరికి ఇందుకోసం వినియోగించుకోవచ్చు. లేదంటే అవుట్‌ సోర్సింగ్‌ పైన నియమించుకోవచ్చు. అంతే తప్ప పిఆర్‌ఓ విభాగమని పేరు పెట్టి ఆ విభాగానికి రిసెప్షన్‌ విభాగం పనులు చేయించడం వల్ల ప్రయోజనం ఉండదు.