శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (14:12 IST)

తితిదేలో గోపూజ వివాదం.. ఛైర్మన్ చెప్పారు.. ఈవో విస్మరించారు... కారణమేంటి?

తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రతి శుక్రవారం సాయంత్రం గోపూజ నిర్వహిస్తాం. ఈ శుక్రవారం నుంచే దీన్ని ప్రారంభిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రండి. ఈనెల 13వ తేదీ తిరుపతి మాధవంలో తన కార్యాలయంలో

తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రతి శుక్రవారం సాయంత్రం గోపూజ నిర్వహిస్తాం. ఈ శుక్రవారం నుంచే దీన్ని ప్రారంభిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రండి. ఈనెల 13వ తేదీ తిరుపతి మాధవంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ప్రకటన చేశారు. ఆశ్చర్యం ఏమంటే దీనికి ముందురోజే తిరుమలలో ఈఓ సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించారు. 
 
సూచనప్రాయంగానైనా గోపూజ గురించి ఆయన చెప్పలేదు. ఛైర్మన్‌ మాత్రం ప్రత్యేకంగా గోపూజ గురించి చెప్పారు. ఏదో ఈఓ మరిచిపోయి ఉంటారులే అనుకున్నారు పాత్రికేయులు. శుక్రవారం వచ్చింది.. శ్రీవారి ఆలయం ముందు గోపూజ నిర్వహించలేదు. గోశాలలో నిర్వహించారు. అనంతరం పొద్దుపోయాక గోవులను ఆలయం ముందుకు తీసుకొచ్చి వాటికి ఆహారం అందించారు. 
 
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ గానీ, ఈఓ సాంబశివరరావుగానీ, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తదితరులు ఎవరూ కనిపించలేదు. గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ కోదండరామారావు ఛైర్మన్‌ పిఎస్‌ తదితరులు మాత్రమే కనిపించారు.
 
తితిదే ఏ కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టినా అత్యంత ఘనంగా ప్రారంభిస్తుంది. అలాంటిది గోపూజ మాత్రం చడీచప్పుడు కాకుండా ఎందుకు సాగిపోయింది? గోశాలలో గోపూజ చేయడం మామూలే. కొత్తేమీ లేదు. ఆలయం ఎదుట చేస్తామన్న గోపూజను గోశాలలోనే ఎందుకు కానిచ్చారు. అసలు ఇది తితిదే పాలకమండలి నిర్ణయించిన కార్యక్రమమేనా? శ్రీవారి ఆలయం ఎదుట గోపూజ నిర్వహించడానికి ఆగమ పండితులు ఆశక్తి చూపలేదు. ఛైర్మన్‌ చదలవాడ మాట్లాడేటప్పుడు ఆలయం వద్ద గోపూజ చేయకూడదని అంటున్నారు. గోవు అందరికీ చాలా పవిత్రమైనది. గోవుకు పూజ చేయడం తప్పేమీకాదు. గోపూజ చేస్తామని చెప్పారు. గోపూజలకు సంబంధించి తితిదేలో ఇంత గందరగోళం ఏమిటో అర్థం కాదు. తిరుపతి గోశాలలో గోపూజ నిర్వహిస్తున్నారు.
 
అలిపిరిలో గోపూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల గోశాలలోనూ పూజ జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆలయం ఎదుట నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏమి వచ్చిందో తెలియదు. అంతా ఏకాభిప్రాయానికి వస్తే ఆలయం ఎదుట చేసినా మంచిదే కానీ ఇప్పుడు జరిగిన తీరు చేస్తుంటే అదేదో తితిదేకి సంబంధం లేనిదిగా కనిపిస్తోంది.