శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (11:42 IST)

ఏయ్‌.. ఎవరనుకుంటున్నావ్‌.. తితిదే ఛైర్మన్‌ రైట్‌ హ్యాండ్‌ని...! చదలవాడ బంధువు హల్‌చల్..

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి బంధువులమంటూ నలుగురు తిరుమలలో హల్‌ చల్‌ చేశారు. భక్తుల రద్దీ ఉన్న ప్రాంతంలో కారును స్పీడుగా నడపడమే కాకుండా అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిని బూతులు

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి బంధువులమంటూ నలుగురు తిరుమలలో హల్‌ చల్‌ చేశారు. భక్తుల రద్దీ ఉన్న ప్రాంతంలో కారును స్పీడుగా నడపడమే కాకుండా అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిని బూతులు పుట్టారు. ఇక చేసేదేమీ లేక సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో జరిగింది.
 
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో బూతుల పురాణం మొదలుపెట్టారు కొంతమంది ప్రముఖులు. ఎప్పుడూ గోవిందనామస్మరణలు వినాల్సిన ప్రాంతంలో పనికిమాలిన మాటలు వినాల్సి వచ్చింది భక్తులకు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. సామాన్య భక్తులను అదుపుచేయలేక సెక్యూరిటీ సిబ్బంది చేతులెత్తేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విఐపి వాహనాలను కూడా ఎవరినీ అనుమతించలేదు. కేటాయించిన ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్‌ చేశారు. ఎటీసీ, ఎంబీసీ, నారాయణగిరి విశ్రాంతి సముదాయాల్లో భక్తులతో రహదారులు కిటకిటలాడాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా మూసేశారు. 
 
అయితే రహదారి మూసేసిన విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది ముందు నుంచే వాహనదారులు సమాచారమిస్తూ వచ్చారు. కానీ చదలవాడ కృష్ణమూర్తి బంధువులమంటూ కారులో నుంచి నలుగురు దిగి మమ్మల్ని పంపించండి అంటూ గొడవకు దిగారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. అంతేకాదు తితిదే సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారు. 
 
సర్‌.సర్‌.అంటూ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు మాట్లాడుతున్న పట్టించుకోలేదు. తితిదే ఛైర్మన్‌ బంధువులమంటూ నానా గందరగోళం సృష్టించిన వారిని భక్తులు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. పవిత్రమైన స్థలంలో ఇలాంటి బూతులు మాట్లాడడం ఏమిటని కొంతమంది భక్తులు అడిగే ప్రయత్నం చేస్తే వారిపైనే దాడికి ప్రయత్నించారు. చివరకు పోలీసులు వారిని ఏమీ అనలేక అక్కడి నుంచి పంపేశారు. తితిదే ఛైర్మన్‌కు భయపడి పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు.