శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్

కోనేటి రాయుడు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల గిరుల్లో వెలసివున్న కోనేటి రాయుడు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. తిరుమల వసంత మండపంలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం విష్వక్సేనుడు మాడవీధుల్లో విహరించనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల 23 నిమిషాలకు ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల కారణంగా 9 రోజుల పాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ పొరపాటు కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడి ప్రమాణ స్వీకారం విషయంలో గందరగోళం నెలకొంది. ఒకరికి బదులుగా మరొకరికి అధికారులు సమాచారమివ్వడంతో ఈ గందరగోళం తలెత్తింది. తితిదే సభ్యుడిగా ముంబైకి చెందిన రాజేశ్ శర్మను ప్రభుత్వం నియమించింది.
 
ఇందుకు సంబంధించిన సమాచారం మాత్రం ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు పంపింది. అజెండాతో పాటు ప్రమాణ పత్రాన్ని ఆయనకు పంపారు. అక్టోబరు 3వ తేదీన రాజేశ్ శర్మ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లుచేశారు. అయితే, టీటీడీ అధికారులను ముంబైకి చెందిన రాజేష్ శర్మ సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది.