తిరుమలలో వీఐపీ బ్రేక్.. ఉంచుదామా.. ఎత్తేద్దామా? : తితిదేలో చర్చ
తిరుమల శ్రీవారి దర్శనం కోసం అనుసరిస్తున్న వీఐపీ బ్రేక్ దర్శనాల ఎత్తివేతపై తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చర్చించింది. ఈ మేరకు తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం జరిగిన తితిదే పాలక మండలి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది.
అయితే, వీఐపీ బ్రేకులో అమలు చేస్తున్న ప్రాధాన్య దర్శనాల (లిస్ట్1, లిస్ట్2) ఎత్తివేతపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. బ్రేకు దర్శనాలు కోరుకునే అందరూ ప్రాధాన్య దర్శనాల కోసం ఒత్తిడి తెస్తున్నారని, దీంతో ఈ విధానం దుర్వినియోగమయ్యే పరిస్థితి ఉన్నందున రద్దు చేయాలని ఉన్నతాధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు.
ఈ విధానం రద్దుకు కొందరు సమ్మతించగా, ఇంకొందరు లిస్ట్-1, లిస్ట్-2 విధానాన్ని రద్దుచేసి ప్రొటోకాల్ దర్శనంతో పాటు సాధారణ బ్రేకు దర్శనాలను అమలు చేయాలని సూచించారు. మరికొందరైతే లిస్ట్-1, లిస్ట్-2 దర్శన టికెట్ల ధరలను రెట్టింపుచేసి.. లిస్ట్-3 దర్శనాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. కాగా, ఈ సమావేశంలో తితిదే ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీనిపై తితిదే ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.