శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 13 డిశెంబరు 2014 (16:35 IST)

కుబేరుడు వద్ద వెంకన్న తీసుకున్న అప్పు ఎంత : ఆర్టీఐలో దరఖాస్తు!

కలియుగదైవంగా భక్తులు కొలుచుకునే వడ్డీకాసులవాడు (శ్రీవేంకటేశ్వర స్వామి) తన వివాహం కోసం కుబేరుడు వద్ద తీసుకున్న అప్పు ఎంత అనే విషయంపై బెంగుళూరుకు చెందిన సమాచార హక్కు కార్యకర్తల(ఆర్టీఐ) టి నరసింహ మూర్తి ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఆయన టీటీడీకి దరఖాస్తు చేశాడు. 2012, ఫిబ్రవరి ఆరో తేదీన దరఖాస్తు చేసుకోగా, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. 
 
వాస్తవానికి తిరుమల వెంకన్నను వడ్డీకాసులవాడిగా భక్తులు కొలుచుకుంటుంటారు. పైగా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా వెంకన్న ప్రసిద్ధిగాంచాడు. స్వామి వారిని దర్శించుకునే ప్రతి భక్తుడూ తమ శక్తిమేర తక్కువ మొత్తం నుంచి కోట్లాది రూపాయల వరకు ఆయనకు కానుకగా సమర్పిస్తుంటారు. 
 
అయితే, తిరుమల శ్రీవారు తన వివాహం నిమిత్తం కుబేరుడి వద్ద అప్పు చేశాడని... ఆ అప్పుకు ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నాడనే విషయం భక్తులందరికీ తెలుసు. ఆయన అప్పు తీర్చేందుకు భక్తులందరూ తమ వంతుగా తమ తాహతుకు తగ్గట్టు స్వామి వారి హుండీలో ముడుపులు వేయాలని భక్తులు భావించి కానుకలు వేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో... ఆర్టీఐ కార్యకర్త టి.నరసింహమూర్తికి. కుబేరుడి వద్ద వెంకన్న తీసుకున్న అప్పు ఎంతో తెలుసుకోవాలనే కోరిక కలిగింది. వెంటనే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులో ఇప్పటికే భక్తులందరూ భారీగా హుండీలో డబ్బులు వేశారు... ఇంకా ఎంత వేయాలి? ఎంత కాలం వేయాలి? అనే విషయాలకు సమాధానం చెప్పాలని సమాచార హక్కు చట్టం ద్వారా టీటీడీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టీటీడీ నుంచి ఇప్పటి వరకు సమాధానం రాకపోవడంతో నరసింహమూర్తి స్పందించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, సమాధానం వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు.