శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (09:09 IST)

పురుషుల వేషంలో మహిళలు.. చివరి రోజున పోలీసుల ప్లాన్‌?

శబరిమల ఆలయంలోని మహిళలకు ప్రవేశం కల్పించే విషయంపై సుప్రీంకోర్టు తీర్పును తు.చ తప్పకుండా అమలు చేసేందుకు కేరళలోని వామపక్ష ప్రభుత్వం చేయని ప్రయత్నాలంటూ లేవు. ఈ విషయంలో భక్తుల మనోభావాలు, ఆలయ సంప్రదాయాలను విస్మరించి తొక్కి తన పంతం నెగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, పురుషుల వేషంలో మహిళలను శబరిమల ఆలయానికి తీసుకువెళ్లడానికి పథకం వేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, ఆలయ సన్నిధానం, పంబ వద్ద వందల సంఖ్యలో ఉన్న భక్తులు ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో శబరిమల చుట్టూ, పంబా వద్ద ఉన్న మీడియా ప్రతినిధులను సోమవారం వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల చేపట్టే దౌర్జన్యకాండ బయటకు తెలియకుండా జామర్లు అమరుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. 
 
కాగా, నెలవారీ పూజల కోసం ఈ నెల 18వ తేదీన అయ్యప్ప ఆలయాన్ని తెరవగా.. చివరి రోజైన సోమవారం ఆలయానికి బయలుదేరిన దళిత కార్యకర్త బిందును పంబ చేరుకోకుండానే బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్లను ఎప్పుడు విచారించేదీ మంగళవారం నిర్ణయించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో ఆలయంతో పాటు.. పంబా నదివద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి.