శ్రీవారి వార్షిక బడ్జెట్ రూ.2678 కోట్లు, లడ్డూ ధర పెరగలేదు...
వడ్డీకాసుల వాడు... ఏ ఏడాదికాయేడాది దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఆదాయంలోనూ, వ్యయంలో శ్రీవారికి సాటి ఎవరూ లేరు. దేశవ్యాప్తంగా భక్తులు కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బడ్జెట్ ఇపుడు 2,678 కోట్లు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం నేడు టిటిడి వార్షిక బడ్జట్ 2678 కోట్లకు ఆమోదం తెలిపింది. దీనితో పాటు పలు నిర్ణయాలను తీసుకుంది.
శ్రీవారి వైభవోత్సవాలు 8 రోజుల నుండి 5 రోజులకు కుదించారు. తిరుపతి లడ్డు ధర పెంచుతారని మొదట్లో వదంతులు వచ్చాయి. కానీ లడ్డూ ధర పెంచడం లేదని పాలక వర్గం పేర్కొంది. శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి బంగారు తాపడం చేయాలని కమిటీ నిర్ణయించింది. తిరుమలలో భద్రత కోసం ఆక్టోపస్ భద్రతా దళానికి 4.5 కోట్లతో భవనాన్ని నిర్మిస్తున్నారు.
తిరుమల రెండో ఘాట్ రోడ్డు మరమ్మతుకు 3.3 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహామణి మండప నిర్మాణానికి 18 కోట్లు ఆమోదించారు. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో అమావాస్య నాడు హనుమంత వాహనం నిర్వహించాలని పాలక వర్గం నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇ.ఓ. జె.ఎస్.వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.