శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. 2017 రౌండప్
Written By pnr
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (14:51 IST)

2017 'బాహుబలి' నామ సంవత్సరం... ఎందుకో తెలుసా?

తెలుగు చిత్రపరిశ్రమ చరిత్రలో 2017 సంవత్సరం సువర్ణాక్షరాలతో లిఖించదగిన యేడాదిగా మిగిలిపోనుంది. ఈ సంవత్సరంలో విడుదలైన "బాహుబలి : ది కంక్లూజన్" చిత్రం భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది.

తెలుగు చిత్రపరిశ్రమ చరిత్రలో 2017 సంవత్సరం సువర్ణాక్షరాలతో లిఖించదగిన యేడాదిగా మిగిలిపోనుంది. ఈ సంవత్సరంలో విడుదలైన "బాహుబలి : ది కంక్లూజన్" చిత్రం భారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. భారతదేశ చిత్రపరిశ్రమ అంటే ఒక్క బాలీవుడ్ మాత్రమేనన్న పేరును ఈ చిత్రం చెరిపేసింది. 'బాహుబలి' ప్రభంజనానికి దేశ బాక్సాఫీస్ రికార్డులన్నీ కనుమరుగైపోయాయి. 'బాహుబలి' చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా, విడుదలైన అన్ని భాషల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ రికార్డులను ఏ ఒక్క హీరో అధికమించలేనంత ఎత్తులో ఉన్నాయి. ఈ ఒక్క చిత్రమే అధికారిక లెక్కల ప్రకారం ఏకంగా రూ.1706.50 కోట్లను కలెక్షన్ చేసింది. అనధికారికంగా ఈ సంఖ్య రూ.రెండు వేల కోట్లకు పైమాటగానే ఉన్నట్టు  ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
 
2017 ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ అయిన 'బాహుబలి 2' చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ వంటి అగ్రనటులు నటించగా, దర్శకదిగ్గజం ఎస్ఎస్. రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆర్కా మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 
 
ఇకపోతే 2017లో కనకవర్షం కురిపించిన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి దాదాపు దశాబ్దకాలం తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం తమిళ చిత్ర 'కత్తి'కి రీమేక్. వివి వినాయక్ దర్శకత్వం వహించగా, చిరంజీవి తనయుడు రాంచరణ్ తన సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్‌పై నిర్మించారు. ఈ చిత్రం 150 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. అలాగే, మహేష్ బాబు నటించిన "స్పైడర్" చిత్రం కూడా రూ.150 కోట్ల క్లబ్‌లో చోటుదక్కించుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ కలెక్షన్లపరంగా సక్సెస్ అయింది.
 
ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రం రూ.131 కోట్లను కలెక్ట్ చేసింది. అలాగే, అల్లు అర్జున్ నటించిన "దువ్వాడ జగన్నాథం" (డీజే) రూ.98.1 కోట్లు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "కాటమరాయుడు" రూ.97.5 కోట్లు, వరుణ్ తేజ్ నటించిన "ఫిదా" రూ.90 కోట్లు, నందమూరి బాలకృష్ణ నటించిన "గౌతమీపుత్ర శాతకర్ణి" రూ.78.6 కోట్లు, నాని హీరోగా నటించిన "నేను లోకల్" చిత్రం రూ.58 కోట్లు, విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "అర్జున్ రెడ్డి" చిత్రం రూ.50 కోట్లు చొప్పున కలెక్షన్లు వసూలు చేశాయి.