శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. శ్రీరామనవమి
Written By selvi
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (11:53 IST)

భద్రాద్రిలో అట్టహాసంగా మహాపట్టాభిషేకం.. రాజదంపతులుగా దర్శనమిచ్చిన సీతారాములు

భద్రాద్రి శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం మంగళవారం అట్టహాసంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని సోమవారం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం శ్రీ సీతారాముల సదస్యము,

భద్రాద్రి శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవం మంగళవారం అట్టహాసంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని సోమవారం శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం శ్రీ సీతారాముల సదస్యము, హంసవాహన సేవలు జరుగనున్నాయి.
 
ఇక ఈ నెల 29న తెప్పోత్సవం, దోపు ఉత్సవం, అశ్వవాహన సేవ, 30న స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ, సింహవాహన సేవ జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. 31న వసంతోత్సవం, గజవాహన సేవ.. ఏప్రిల్ 1వ తేదీన శ్రీ చక్రతీర్థం, ధ్వజారోహణం, శేషవాహన సేవను నిర్వహించనున్నారు. పుష్పయాగంతో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 
 
ఇందులో రాములోరి పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాజసం ఉట్టిపడేలా రాములోరు సర్వాలంకారణాభూషితుడై ఓ వెలుగు వెలిగారు. పట్టాభిషేక ఉత్సవం కోసం పన్నెండు నదీజలాలను వినియోగించారు. ప్రధఆన కలశజల ప్రోక్షణతో రామప్రభువు పట్టాభిషిక్తుడయ్యారు. శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు వందలాది మంది భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు.
 
ఈ పట్టాభిషేకంలో హనుమంతుడితో రాజదంపతులుగా సీతారాములు దర్శనమిచ్చారు. యువరాజుగా లక్ష్మణస్వామికి పట్టాభిషేకం చేశారు. రాజ చిహ్నాలతో శ్రీరామ చంద్రునికి అలంకారం చేశారు. కిరీటం, ఛత్రం, రాజదండం, రాజముద్రిక, బంగారు పాదుకలు, వింజామరలు సమర్పించారు. రాజారామచంద్రునికి అష్టోత్తర శతనామార్చన చేశారు.