మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (15:54 IST)

పవన్ వ్యూహాత్మక నిర్ణయం : మీ ఓటు.. మీ యిష్టం.. నేను చెప్పను...

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ వైఖరిపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యూహత్మకంగా వ్యవహరించారు. ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. పైగా, మీ ఓటు.. మీ ఇష్టం అంటూ అభిమానుల విజ్ఞతకే ఆయన వదిలివేశారు. 
 
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈనెల 7వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార తెరాస, ఇటు ప్రజాకూటమితో పాటు బీజేపీలు ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈ పార్టీల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. ఇలాంటి తరుణంలోనే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మద్దతు ప్రకటించలేదు. అభ్యర్థులను చూసి ఓటేయాలంటూ కార్యకర్తలకు సూచించారు. ఇటు తెరాసకు మద్దతు ఇస్తే టీడీపీ ఆరోపణలు నిజమవుతాయి. ఒక వేళ ప్రజాఫ్రంట్‌కు మద్దతు పలికితే... ఆ కూటమిలో ఉన్న టీడీపీకి పరోక్షంగా మద్దతు పలికినట్లవుతుంది. ఇది ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. 
 
టీడీపీ, జనసేన ఒక్కటేనంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమేనన్న సందేశాన్ని పంపినట్లవుతుంది. దీంతో పవన్ వ్యూహాత్మకంగా ఆలోచించి .. మంచి అభ్యర్థి ఏపార్టీ వారైనా ఓటేయండంటూ పిలుపునిచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది మంచి నిర్ణయమని పలువురు కొనియాడుతున్నారు.