శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శనివారం, 1 డిశెంబరు 2018 (10:14 IST)

తెలంగాణ ఎన్నికలు.. ఓటుకు రూ.4 వేలు.. ఖమ్మంలోనే అధికం

తెలంగాణ ఎన్నికల్లో గెలుపును సొంతం చేసుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కో ఓటుకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అలా భారీ ధర పలుకుతున్న ప్రాంతాల్లో ఖమ్మం మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్క ఓటు ధర రూ.4 వేల వరకు పలుకుతోంది. 
 
అంతేకాకుండా, ఈ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి కనీసం పది కోట్ల రూపాయల మేకరకు ఖర్చు చేయాలన్న ధోరణితో ముందుకు సాగుతున్నారు. అందువల్లే ఒక్కో ప్రాంతంలో ఓటు ధర రూ.1500 నుంచి రూ.4 వేల వరకు పలుకుతోంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఒక్కో ఓటు ధర రూ.500 నుంచి రూ.1000 వరకు పలుకుతోంది. ఇందుకోసం కావాల్సిన సొమ్మును కూడా ఆయా అభ్యర్థులు సిద్ధం చేసుకునివున్నారు. పోలింగ్‌కు ముందు ఈ డబ్బును పంపిణీ చేసేలా అభ్యర్థులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
మరోవైపు, ఎన్నికల వేళ హవాలా సొమ్ము కట్టలు తెంచుకుంది. ఏజెంట్లు విదేశాల నుంచి డబ్బు తెప్పిస్తున్నారు. ఇటీవల పంజాగుట్ట పోలీసులు రూ.20 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ నగదు వెస్ట్రన్‌ మనీ యూనియన్‌ ద్వారా ఓల్గా వీడియోస్‌ యజమాని ప్రసాద్‌ ఖాతాల్లో జమైనట్టు, ఆ సొమ్మును ప్రసాద్‌ తన ఉద్యోగులు ద్వారా నాయకులకు ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టు తేలింది. అయితే ఆ నగదు ఎవరికి ఇచ్చేందుకు? అనే దానిపై విచారణ జరుగుతోంది.