శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (15:31 IST)

సింహం సింగిల్‌గానే వస్తుంది.. కానీ పందులే గుంపులుగా వస్తాయి : కేటీఆర్

గత నాలుగున్నరేళ్లుగా పల్లెలవైపు కన్నెత్తి కూడా చూడని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇపుడు సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్టుగా వస్తున్నారంటూ తెరాస నేత, తాజా మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే, గడ్డం పెంచుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్‌లు కాలేరని వంగ్యాస్త్రాలు సంధించారు. 
 
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మండిపడ్డారు. సంక్రాంతి పండుగకి గంగిరెద్దుల లాగా రాజకీయ నాయకులు ఊర్లలోకి వస్తున్నారంటూ ఎద్దెవా చేశారు. 
 
కేసీఆర్‌ను ఓడగొట్టడానికి అందరూ ఒకటి అయ్యారు.. సింహం సింగిల్‌గా వస్తుంది.. కానీ గుంపులు గుంపులుగా పందులు వస్తున్నాయని జాగ్రత్త అని ప్రజలకు కేటీఆర్ సూచించారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు కుటుంబాల సభ్యులు రాజకీయాల్లో లేరా? మాది ఒక్కటే ఫ్యామిలీ రాజకీయాల్లో ఉందా? అని ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్లిన తనకు మంచి గుర్తింపు వస్తుందంటే దానికి సిరిసిల్లనే కారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మాటే వినిపిస్తోందన్నారు. మానేరుపై రాజమండ్రి తరహాలో రైలు కం రోడ్ వంతెన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ స్పష్టంచేశారు.