శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (10:16 IST)

మా అభ్యర్థిని గెలిపిస్తే సోమశిల ప్రాజెక్టు నిర్మిస్తాం : నితిన్ గడ్కరీ

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలంతా పాల్గొంటున్నారు. వారిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు. ఆయన ఆదివారం కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సుధాకర్ రావును గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న తమ అభ్యర్థి సుధాకర్ రావును గెలిపిస్తే సోమశిల - సిద్ధేశ్వరం వంతెన నిర్మిస్తామన్నారు. అలాగే, సోమశిల ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. తెలంగాణాలోని జాతీయ రహదారులను అనుసంధానిస్తామని వెల్లడించారు. 
 
ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్న సుధాకర్ రావు ఉన్నత విద్యావంతుండని, మంచి ఇంజనీరింగ్ నిపుణుడని చెప్పారు. పైగా, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అందువల్ల ఆయన్ను గెలిపించాలని కోరారు.
 
పైగా, కొల్లాపూర్‌లో ఆస్పత్రులు లేవు.. ఒకవేళ ఎక్కడో ఓ చోట ఆస్పత్రి ఉంటి వైద్యులు ఉండరని ఎద్దేవా చేశారు. అలాగే, పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా లేరన్నారు. అనేక స్కూళ్లను మూసివేస్తున్నారని తెలిపారు. 20యేళ్లుగా ఇక్కడి ప్రజలు సంతోషంగా లేరని చెబుతున్నారు… అందుకే అభివృద్ధిని పట్టించుకోని నాయకులను ఇంటికి పంపండని, పేదల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సుధాకర్‌రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే జాతి, కుల, మతాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని నితిన్ గడ్కకరీ హామీ ఇచ్చారు.