శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By CVR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (09:38 IST)

క్రైస్తవులకే కేసీఆర్ అగ్రతాంబూలం...! రూ. 10 కోట్లతో కొత్త భవనం...!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ క్రైస్తవులకు వరాలు కుమ్మరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఆయన గురువారం ఒక ప్రకటనను వెల్లడించారు. హైదరాబాద్‌లో క్రైస్తవులు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు రూ.10 కోట్ల వ్యయంతో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని  ప్రకటించారు. అందుకుగాను స్థలాని కూడా ఈ రోజు ప్రకటిస్తామని తెలిపారు. 
 
ఇందులో భాగంగా ఆయన గురువారం లలిత కళాతోరణంలో నిర్వహించిన 36వ ఐక్య క్రిస్మస్ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో క్రైస్తవ సోదరులకు ఎటువంటి లోటు ఉండదన్నారు. దళితులు క్రైస్తవులుగా మారినంత మాత్రాన వారికి అందాల్సిన హక్కులు అందకుండాపోవని తెలిపారు. 
 
మా ప్రభుత్వం దళితులకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నదో అవే పథకాలు దళిత క్రైస్తవులకూ అందుతాయని, వారి సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని హామీ ఇచ్చారు. 
 
అదేవిధగా క్రైస్తవ సోదరుల కోరిక మేరకు జనవరి 1న ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తామని, క్రిస్మస్‌ పండుగకు రెండురోజుల ప్రభుత్వ సెలవు ప్రకటిస్తున్నామని ఆయన వెల్లడించారు. నగరంలో క్రైస్తవులకు ప్రత్యేక సమాధుల కోసం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను కేటాయిస్తామని, దానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేస్తామన్నారు.
 
చర్చిల నిర్మాణ ప్రక్రియను సులభతరం చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని, అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అనుమతిపైనా శుక్రవారం జీవోని తీసుకొస్తామని కేసీఆర్ తెలిపారు.