గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 ఆగస్టు 2024 (15:32 IST)

నిబంధనల మేరకు కూల్చివేతలకు సిగ్నల్ : హైడ్రా చర్యలపై హైకోర్టు వ్యాఖ్యలు

shanti kumari
హైదరాబాద్ నగరంతో పాటు నగరంలోని నీటి వనరులను పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా అనే సంస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సంస్థ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను నియమించింది. ఈయన రంగంలోకి దిగి నీటి వనరులను ఆక్రమించి నిర్మించిన పక్కా భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ చర్యలను మెజారిటీ వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో ఎఫ్.టి.ఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనల మేరకు హైడ్రా ముందుకు వెళ్లాలని చూసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం కీలక సమావేశం నిర్వహించారు. 
 
ఇందులో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా కమిషనర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూల్చివేతలపై న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏం చేయాలో సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతూనే వాటిపై చర్చించారు కూడా. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన కలెక్టర్లు కూడా హాజరయ్యారు. 
 
తమ భవాలను కూల్చుతారనే ఆందోళనతో పలువురు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ పిటిషన్‍‌లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. నిబంధన మేరకు ముందుకు వెళ్లాలని సూచన చేసింది. ఈ క్రమంలోనే ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించడం గమనార్హం.