1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 13 ఆగస్టు 2020 (13:21 IST)

పనికి రావడంలేదని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు, కాదు అమ్మాయిలకు మెసేజ్ చేస్తున్నాడనీ...

నిజామాబాద్‌ జిల్లా మాల్కాపూర్ తాండలో ఓ బాలుడిపై పెద్దనాన్న కిరాతకంగా వ్యవహరించాడు. పనికి రావటంలేదని బాలుడి కాళ్లకు తాళ్లు కట్టి రోడ్డుపై కొట్టుకుంటూ ఈడ్చుకు వెళ్లాడు. అక్కడ ఉన్నవారు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బాధితుల  ఫిర్యాదు మేరకు నిందితుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
 
మల్కాపూర్‌ గ్రామానికి చెందిన ముద్దంగుల బాలయ్య (55) కుల వృత్తి అయిన రాళ్లు కొట్టే కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అతడి వద్ద పదుల సంఖ్యలో కూలీలు పనులు చేస్తున్నారు. సమీప బంధువైన బాలుడు తండ్రి అనారోగ్యం, తల్లి మతి స్థిమితంలేని కారణంగా కుటుంబ పోషణ నిమిత్తం చదువు మానేసి కొన్నేళ్లుగా బాలయ్య వద్ద రాళ్లు కొట్టే పనిలో కుదిరాడు.
 
అయితే కొద్దిరోజులుగా బాలుడు సరిగ్గా పనులకు వెళ్లడం లేదు. దీంతో పనికి సరిగ్గా రాకపోగా, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదన్న కోపంతో బాలయ్య, మిత్రులతో కలిసి ఆడుకుంటున్న బాలుడిని బాలయ్య పట్టుకుని చితక్కొట్టాడు. కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి రోడ్డు నుంచి ఇంటివరకు బలవంతంగా లాక్కెళ్లాడు.
 
గాయాలపాలైన బాలుడు వద్దని వారించినా, కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. దానికి తోడు బాలయ్య కుటుంబీకులు కూడా బాలుడిని కొట్టాలని ప్రోత్సహించారు. ఓవైపు గ్రామ పెద్దలు వారించినా వినలేదు. ఇంటి సమీపంలోని ఇనుప రాడ్‌కు కట్టివేసి అక్కడే కాపలా ఉన్నాడు. చివరకు గ్రామ సర్పంచ్‌ శేఖర్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ వెంకట్‌రెడ్డి వెళ్లి భీమయ్యను విడిపించి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.
 
ఇటువంటి హేయమైన చర్యలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని బాలయ్యను హెచ్చరించారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించడంతో బాలయ్య మాటమర్చాడు, బాలుడు అమ్మాయిలకి  మేసేజ్‌లు పెడుతున్నాడని అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని బుకాయించాడు. అయితే బాలుడు కుటుంబసభ్యులు మాత్రం బాలుడు మీద నింద మోపే ప్రయత్నం బాలయ్య చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు తప్పు చేసి ఉంటే మేసేజ్‌లు చూపించాలి కదా అని నిలదీస్తున్నారు.