మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (22:47 IST)

మోచేయి విరిగిందని పోతే ప్రాణం తీసిన వైద్యులు... ఏం చేశారంటే...

గాయం అయిందని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళితే ఆపరేషన్ పేరిట ప్రాణం తీసి, చనిపోయాక కూడా మెరుగైన చికిత్స నిమిత్తం హైద్రాబాద్ పంపించారు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది వైద్యుల తీరు. ఈ ఆసుపత్రిలో ఇది రెండవ మరణమని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన రాజశేఖర్ రెడ్డి(32) మోచేతికి గాయం అయ్యిందని షాద్ నగర్ పట్టణంలోని సేవాలాల్, అనే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళితే పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని ఆపరేషన్ సమయంలో అనిస్తిషియా ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో రాజశేఖర్ రెడ్డి చనిపోయాడని, దాన్ని గమనించిన సిబ్బంది వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లారు. 
 
అప్పటికే రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో సేవాలాల్ ఆసుపత్రి సిబ్బంది రాత్రికి రాత్రే 30 మంది పోలీసుల బందోబస్తును ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసుకున్నారని, మద్యం తాగి మద్యం మత్తులో అనిస్తిషియా మత్తు మందు ఇచ్చారని తాము చూస్తుండగానే ఆస్పత్రిలోకి కొందరు మద్యం బాటిళ్లు తీసుకెళ్ళారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఆసుపత్రి బయటనే మద్యం బాటిళ్లు దర్శనమివ్వడం కుటుంబ సభ్యుల అనుమానాన్ని నిజం చేసిందనే చెప్పవచ్చు. 
 
మొన్నటికి మొన్న షాద్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కడుపులో కాటన్, క్లాత్ పెట్టి కుట్లు వేసిన నేపథ్యంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మరువకముందే మరో సంఘటన చోటుచేసుకోవడం వైద్య ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. 
 
వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన రాజశేఖర్ రెడ్డికి ఇద్దరు చిన్నారులు ఉన్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నా రు.