1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (10:53 IST)

మజ్లిస్ కార్పొరేటర్లకు వార్నింగ్.. కాలర్ పట్టుకుని నడిబజారులో నిలబెడతా...

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. మొత్తం 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలోని పాతబస్తీలో ఎప్పటిలానే మస్జిల్ పార్టీ తన హవాను కొనసాగించింది. ఈ పార్టీకి ఏకంగా 42 డివిజన్లు దక్కాయి. 
 
ఆదివారం హాఫీజ్‌ బాబానగర్‌లోని ఫలక్‌ ప్యాలెస్‌ పంక్షన్‌హాల్‌లో నూతన కార్పొరేటర్లు, మజ్లిస్‌ పార్టీ కార్యకర్తలతో విజయోత్సవ సభ నిర్వహించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సన్మానించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మజ్లిస్‌ పార్టీ కార్పొరేటర్లు పదవులను అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం, వేధింపులకు గురిచేసినట్లు తెలిస్తే వారి కాలర్‌ పట్టి నడిబజారులో నిలబెడతానని హెచ్చరించారు. 
 
కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు 'పదవులను ప్రజా సేవ కోసం దేవుడిచ్చిన అవకాశంగా భావించాలని, పదవులను అడ్డుపెట్టుకుని వసూళ్లకు పాల్పడినట్లు తెలిస్తే సహించేది లేదన్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని ప్రజలను వేధించొద్దని' కోరారు. 
 
చాంద్రాయణగుట్ట ప్రాంతం నా రక్తం చిందించిన నేల అని, ఈ ప్రాంతం అంటే నాకెంతో మక్కువ, నా ప్రాణం, నా శ్వాస అన్నారు. ఇక్కడి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా కార్పొరేటర్లు, మజ్లిస్‌ నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓవైసీ హెచ్చరించారు.