1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2020
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (15:34 IST)

తెలంగాణ మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ఇకలేరు

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ హోంశాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి (86) జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.25 గంటలకు కన్నుమూశారు.

ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 28న కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో నాయిని చేరారు. కరోనా తగ్గిన తర్వాత మళ్లీ వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యారు.
 
న్యుమోనియా తలెత్తడంతో సిటీ న్యూరో సెంటర్‌ నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా ఇక్కడి వైద్యులు గుండె ఆపరేషన్‌ చేసి స్టంట్‌ వేశారు.

అయినా ఆరోగ్యం బాగుపడకపోవడంతో.. వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించిందని నాయిని అల్లుడు, రాంనగర్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివా్‌సరెడ్డి, వైద్యులు బుధవారం సాయంత్రం వెల్లడించారు.
 
ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే నాయిని నర్సింహారెడ్డి తుదిశ్వాస విడిచారు. కాగా సీఎం కేసీఆర్‌ బుధవారం సాయంత్రం అపోలో ఆస్పత్రికి చేరుకొని నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు.

ఇక నాయిని సతీమణి అహల్యకు కూడా కరోనా సోకింది. అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు.