1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జులై 2020 (14:59 IST)

తెలంగాణా సర్కారు కీలక నిర్ణయం: ఉచితంగా కరోనా టెస్టులు - చికిత్స

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఉచిత వైద్యానికి రాష్ట్ర వ్యాప్తంగా 20 మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల నియంత్రణకు త్వరలో వాట్సాప్ నెంబర్ తీసుకువస్తున్నట్లు ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17వేలకుపైగా బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కొన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతివ్వడం జరిగిందన్నారు. అయితే వాటిపై కొద్ది రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయని, అందుకే బుధవారం సాయంత్రానికి గానీ, రేపు ఉదయానికిగానీ ఒక వాట్సాప్ నెంబర్ మీడియా ద్వారా తెలియజేస్తామన్నారు. 
 
బాధితులు ఆ నెంబర్‌కు ఫిర్యాదులు చేయవచ్చునని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న ట్రీట్‌మెంట్‌పై పర్యవేక్షణ జరుపుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం మల్లారెడ్డి, కామినేని, మమత మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు.
 
మరోవైపు, తెలంగాణాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కరోనా పరీక్షలు ఉచితంగా చేయడంతోపాటు, చికిత్సను కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 
 
ఇందులో భాగంగా తొలుత మూడు ప్రైవేటు మెడికల్ కాలేజీలు మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది. వీటిలో ఇకపై కరోనా పరీక్షలతోపాటు, కరోనా చికిత్సను ఉచితంగా అందించనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37,745 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు 375 మంది మరణించారు.