శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 అక్టోబరు 2020 (13:04 IST)

కార్పొరేటర్ చొక్కా పట్టుకుని నిలదీసిన మహిళ... ఎక్కడ?

ఇటీవల హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా, ఈ వర్షాల కారణంగా వచ్చిన వదలకు హైదరాబాద్ మహానగరం జలదిగ్భంధంలో చిక్కుంది. ముఖ్యంగా, ఎగువ ప్రాంతాలు సైతం నీట మునిగింది. దీంతో హైదరాబాద్ వాసుల ఆగ్రహానికి హద్దులు లేకుండా పోయింది. తమను పరామర్శించేందుకు వచ్చే రాజకీయ నేతలను చెడామడా కడిగేస్తున్నారు. నిలదీస్తున్నారు. మరికొందరు బాధితులు ఓ అడుగు ముందుకేసి చొక్కా పట్టుకుని నిలదీస్తున్నారు. ఇటీవల ఓ మహిళ తమను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేని కడిగిపారేసింది. ఆ మహిళ దెబ్బకు ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక పారిపోయాడు. ఇపుడు ఓ కార్పొరేటర్‌ను మహిళ చొక్కా పట్టుకుని నిలదీసింది. 
 
గత మంగళవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా వచ్చిన వరద నుంచి భాగ్యనగరి వాసులు ఇంకా బయటపడలేదు. ఇంతలోనే శనివారం మరోమారు వర్షం వచ్చింది. ఈ వర్షం ధాటికి హయత్‌నగర్‌ పరిధిలోని కాలనీల్లో వరద బీభత్సం కొనసాగింది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద చేరుకోవడంతో స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
వరదనీటిలో ఇళ్లలోని వస్తువులన్నీ పాడైపోతున్నాయి. ప్రజాప్రతినిధులు పరామర్శలకు వచ్చి వెళ్లడం తప్ప చేసేదీ ఏమీ ఉండడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హయత్‌ నగర్‌ పరిధిలోని నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. అక్కడ వరద పరిస్థితిని పరిశీలించేందుకు స్థానిక కార్పొరేటర్‌ సామా తిరుమల్‌ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. 
 
ఇక్కడ నాలాల భూములు కబ్జాకు గురవుతున్నాయని తాము ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్లే తమ ప్రాంతం ముంపునకు గురైందని ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో  కార్పొరేటర్‌ చొక్కా పట్టుకుని ఓ మహిళ నిలదీసింది. దీంతో కార్పొరేటర్‌ షాక్ అయ్యాడు. సమస్యలు పరిష్కరిస్తానని చెపుతూ అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు.