మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (14:17 IST)

గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి వచ్చేస్తారా? తలసాని ఎద్దేవా

కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారని చురకలంటించారు. సిద్ధిపేటలో శ్రీనివాస్ యాదవ్ విలేకర్ల

కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి రారని చురకలంటించారు. సిద్ధిపేటలో శ్రీనివాస్ యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. మంత్రి మరోసారి కాంగ్రెస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడ్డారు.


కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనతో తామేదో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారని తలసాని ఎద్దేవా చేశారు. కానీ వారు అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోనుందని తలసాని జోస్యం చెప్పారు.
 
అలాగే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు స్థానాల్లో ఉన్న బీజేపీకి 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కదన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తలసాని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు రాబోయే ఎన్నికల్లో తిరిగి టిఆర్ఎస్‌కు పట్టం కట్టడం ఖాయమన్నారు.
 
అంతకుముందు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. గత కొద్దికాలంగా తెలంగాణలో పలువురు ప్రముఖులు హరిత సవాల్‌ను చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మంత్రి తలసానికి హరిత సవాల్ విసిరారు.
 
ఈ సవాలును స్వీకరించిన మంత్రి శుక్రవారం ఉదయం తన ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం ఎన్టీఆర్, ప్రభాస్, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఏపీ నేత, టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్‌లకు హరిత సవాల్ విసిరారు.