శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 11 జులై 2018 (17:47 IST)

ఎస్.బి.ఐ కాల్‌సెంటర్ పేరుతో రూ.5 కోట్లు కొట్టేశారు.. ఎలా?

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా బ్యాంకులు ఎన్నో విధాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అవగాహనా సందేశాలు పంపుతున్నా ఖాతాదారులు మాత్రం మోసపోతూనే ఉన్

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా బ్యాంకులు ఎన్నో విధాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అవగాహనా సందేశాలు పంపుతున్నా ఖాతాదారులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఎస్.బి.ఐ కాల్ సెంటర్ పేరుతో ఆన్‌లైన్ దొంగలు ఫోన్ చేసి ఏకంగా రూ.5 కోట్లు స్వాహా చేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... గత కొన్ని రోజులుగా ఎస్.బి.ఐ కాల్ సెంటర్ నుంచి అంటూ ఫోన్లు చేసి.. ఖాతాదారుల ఖాతా నుంచి సొమ్మును మాయం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ తరహా ఫోన్ కాల్స్‌పై దృష్టిసారించారు. తీగలాగే కొద్దీ డొంక కదిలింది. ఈ మోసం ముఠాలో 30 మంది సభ్యులు ఉన్నట్టు గుర్తించారు. అందులో ఎనిమిది మంది పట్టుకున్నారు. వీరిని విచారిస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇప్పటివరకు 2 వేల బ్యాంకు ఖాతాలను లూఠీ చేసినట్టు వెల్లడించారు. ఈ ఖాతాల నుంచి 5 కోట్ల రూపాయలు లూఠీ చేసినట్టు అంగీకరించారు. ఇవన్నీ కూడా సామాన్యుల నుంచే. చదువురాని వారి నుంచే. ఒక్కో బ్యాంకు ఖాతా నుంచి రూ.1000 నుంచి రూ.2 వేలు, రూ.5 వేలు ఇలా కాజేసినట్లు చెప్పారు. ఈ ముఠాకు చెందిన వారిలో మరో 22 మంది పరారీలో ఉన్నారు. వాళ్లందరూ కూడా 23వ తేదీలోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. 
 
ఈ ముఠా కొంతమంది టెలి కాలర్స్‌ను నియమించుకుని వారితో గిప్ట్‌లు వచ్చాయని.. ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని.. బ్యాంక్ అకౌంట్ అప్డేట్ కోసమని. పిన్ నెంబర్లు, ఓటీపీ నెంబర్లు తెలుసుకుని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయం చేశారు. ఇదంతా జయశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ ముఠా నుంచి 80 లక్షల రూపాయలతో పాటు బ్యాంక్ చెక్కు బుక్కులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.