శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (10:44 IST)

ప్రయాణికులకు చుక్కలు చూపుతున్న హైదరాబాద్ మెట్రో జర్నీ

హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు మెట్రో రైల్ జర్నీ పగటిపూట చుక్కలు చూపుతోంది. నిమిషాల్లో ముగియాల్సిన జర్నీ సమయం కాస్త రెట్టింపు అవుతోంది. దీంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు మెట్రో రైల్ జర్నీ పగటిపూట చుక్కలు చూపుతోంది. నిమిషాల్లో ముగియాల్సిన జర్నీ సమయం కాస్త రెట్టింపు అవుతోంది. దీంతో ప్రయాణికులు విసుగు చెందుతున్నారు. ముఖ్యంగా, కొద్ది దూరంలో ఉండే గమ్యస్థానానికి వెళ్లేవారు మెట్రో రైళ్ళలో ప్రయాణించేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీనికి కారణం మెట్రో రైల్ స్టేషన్లు ఎక్కి దిగడమే. 
 
అంతేకాకుండా, మార్గమధ్యంలో కూడా మెట్రో రైళ్లూ ఎక్కడబడితే అక్కడ ఆపేస్తున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా వేగంగా వెళ్లాలనుకుంటున్న వారు అనుకోకుండా ఆలస్యమవుతుండటంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. దీనికి బదులు బస్సులు, బైక్‌లపై వెళితే సమయానికి వెళ్లి ఉండే వారమనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
 
నిజానికి మెట్రో స్టేషన్లలో 20 సెకన్ల పాటే ఆగాల్సిన రైళ్లను మధ్యలో కొన్నిసార్లు నిమిషం నుంచి ఐదారు నిమిషాలపాటు ఆపేస్తున్నారు. అమీర్‌పేట నుంచి నాగోల్‌ వెళ్లే మార్గంలోనే మెట్రో రైళ్లు ఎక్కువగా ఆలస్యమవుతున్నాయని మెట్రో ప్రయాణికులు చెబుతున్నారు. అసలే మెట్రో చార్జీల వల్ల ప్రయాణం భారంగా ఉన్నా త్వరగా చేరుకుంటామన్న కారణంతో ఎక్కితే ఆలస్యమవుతోందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు.
 
ఇకపోతే, నవంబర్ 29వ తేదీన ప్రారంభమైన మెట్రో రైలులో సరదాగా ప్రయాణించే వారి సంఖ్యనే అధికంగా ఉంటోంది. రోజువారీగా విధులకు, ఇతర పనుల నిమిత్తం వెళ్లేవారు మెట్రోలో ప్రయాణించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది దూరానికే ఒక్కోసారి మెట్రో స్టేషన్‌ను ఎక్కి దిగడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. రోడ్డు మార్గంలో తక్కువ చార్జీలతో బస్సుల్లోనే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని సమాచారం.