గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 23 అక్టోబరు 2018 (20:38 IST)

వామ్మో... ఆ కుటుంబంలో అన్నదమ్ములందరూ దొంగలే..

ఆ కుటుంబంలో ఆరుగురు అన్నదమ్ములు. అందరూ చోరులే. చైన్ స్నాచింగ్‌లు.. బైక్ దొంగతనాలు.. ఇళ్లు చోరీలు... ఇలా పలు చోర కళల్లో వీరందరూ సిద్ధహస్తులు. వీరిలో ఒకరు మైనర్ బాలుడు కావడం విశేషం.. హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 70 చోరీలకు పాల్పడిన ఈ ఆరుగురు అన్నదమ్మలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 17 కేసుల్లో నిందితులు. ఈ కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు నిత్యం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతుంటారు. అది కూడా చాలా పక్కా పథకం ప్రకారం స్నాచింగ్ చేస్తారు. 
 
ముందుగా రెక్కీ నిర్వహించి ఆ తరువాత రంగంలోకి దిగుతారు. తేడా వస్తే తమ దగ్గరున్న రాడ్స్, కత్తులతో బెదిరిస్తారు. అంతేకాదు ఎదురుతిరిగితే చంపడానికి కూడా వెనుకడుగేయరు. ఈ అన్నదమ్ముల్లో ప్రస్తుతం ముగ్గురు దొంగలు జైల్లోనే ఉన్నారు. ఇటీవల అక్టోబర్ 22న ఓ మహిళ మెడలో  మంగళసూత్రాన్ని లాక్కుని పారిపోతున్న ఈ నిందితుల్లో ఒకరిని చౌటుప్పల్‌ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. 
 
అతనికి సహకరించిన మైనర్ బాలుడినీ అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోమ్‌కు తరలించారు. అనంతరం సీసీఎస్‌ పోలీసుల సహకారంతో నిందితుల కేసులన్నీ తిరగదోడారు. పహాడీషరీఫ్‌ పరిధిలోని షాహీన్‌నగర్‌ సమీపంలో వాదే ముస్తఫా నగర్‌లో నివసించే మహ్మద్‌ సుల్తాన్‌, మహ్మద్‌ షరీఫ్‌, మహ్మద్‌ సలీమ్‌, మహ్మద్‌ మోయిన్‌, మహ్మద్‌ నయీమ్‌తో పాటు ఓ మైనర్‌ బాలుడు అన్నదమ్ములు. 
 
వీరిలో మూడో వాడైన సలీమ్‌ 42 చోరీలకు పాల్పడి ప్రస్తుతం మెదక్‌ సబ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండో వాడైన షరీఫ్‌ 17 కేసుల్లో నిందితుడు. అయిదు పర్యాయాలు జైలుకు వెళ్లొచ్చాడు. తాజాగా షరీఫ్‌ మైనర్‌ తమ్ముడితో కలిసి చౌటుప్పల్‌ ఠాణా పరిధిలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసి పరారవుతుండగా, మహిళ కేకలు వేయడంతో చుట్టుప్రక్కలవారు, పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కూపీ తీయగా వారి వద్ద ఎనిమిది తులాల బంగారం, అయిదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.