శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 14 సెప్టెంబరు 2019 (09:17 IST)

కేసీఆర్‌తో మాట్లాడతా: యురేనియం తవ్వకాలపై కేటీఆర్

రాష్ట్రంలో అగ్గి రాజేస్తున్న నల్లమల యురేనియం తవ్వకాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు స్పందించారు. యురేనియం తవ్వకాలపై నల్లమల అడవుల్లో ఉంటున్న గిరిజనులు, ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఆవేదన తన దృష్టికి వచ్చిందని కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

సామాజిక మాధ్యమాల్లో సేవ్‌ నల్లమల (నల్లమలను రక్షించండి) పేరిట కవులు, కళాకారులు, రచయితలు, సినీరంగ ప్రముఖులు, టాలీవుడ్‌ తారలు చేస్తున్న ప్రచారంపై కేటీఆర్‌ స్పందించారు. నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న యురేనియం సర్వే, తవ్వకాలపై తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వ్యక్తిగతంగా మాట్లాడు తానని పేర్కొన్నారు. తవ్వకాలపై ఇప్పటికే విపక్షాలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

యురేనియం తవ్వకాలను నిరసిస్తూ రెండు రోజుల క్రితం నాగర్‌కర్నూల్‌ జిల్లా బంద్‌కు అక్కడి ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) పిలుపునిచ్చి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు నేతృత్వంలో యురేనియం తవ్వకాలపై కమిటీని ఏర్పాటు చేసింది.

కలిసివచ్చే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని త్వరలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. మరోవైపు తెలుగు సినీ తారలు, కవులు, రచయితలు సామాజిక మాధ్యమాల్లో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ పెద్దఎత్తున గళం వినిపిస్తున్నారు. సేవ్‌ నల్లమల పేరిట ప్రజలు తమ ఆవేదను తెలియజేస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ స్పందించారు.