ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (08:51 IST)

దుబ్బాక ఉప ఎన్నికలు : రికార్డు స్థాయిలో పోలింగ్.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే...!

తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి భయాన్ని పటాపంచలు చేస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. ఫలితంగా పోలింగ్ సమయం ముగిసినప్పటికీ.. నిర్ణీత సమయంలోగా వరుస క్రమంలో ఉన్న వారందరికీ ఓటు హక్కును వినియోగించే అవకాశం కల్పించారు. దీంతో ఈ ఉప ఎన్నికలో 82.61 శాతం పోలింగ్ నమోదైంది. 
 
పైగా, ఒకటి రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించేలా చూడడంతోపాటు పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజ్ చేశారు. అలాగే, ఈవీఎం బటన్ నొక్కేందుకు కుడి చేతికి గ్లౌజు అందించారు. శరీర ఉష్ణోగ్రతను చెక్ చేసిన అధికారులు జ్వరం లక్షణాలు ఉన్న వారికి సాయంత్రం 5-6 మధ్య ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోకెన్లు పంపిణీ చేశారు. 
 
కాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి హఠాన్మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో తెరాస తరపున రామలింగా రెడ్డి సతీమణి సోలిపేట సుజాత, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్‌ రావులు బరిలో నిలిచారు. మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. పోటీ మాత్రం ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యే ఉంది. ఇపుడు రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడంతో ఈ మూడు పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే, గత ఎన్నికల (86.24 శాతం)తో పోలిస్తే 3.63 శాతం తక్కువ కావడం గమనార్హం.