1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: సోమవారం, 21 జూన్ 2021 (18:39 IST)

పెళ్ళి కోసం వచ్చి కరోనాతో 50 లక్షలు ఆసుపత్రికి సమర్పించి, చివరకు?

ఉన్నత చదువులు చదువుకుంది. అమెరికాలో ఇంజనీర్‌గా స్థిరపడింది. పెళ్ళి నిశ్చయం కావడంతో స్వదేశానికి వచ్చింది. కొన్నిరోజుల్లో పెళ్ళి సందడి మొదలు కావాల్సిన ఆ ఇంట్లో ఏడుపులతో మారుమ్రోగుతోంది. కరోనా మహమ్మారి మిగిల్చిన విషాదం ఇది.
 
పెళ్ళి చేసుకునేందుకు స్వదేశానికి వచ్చి కరోనాతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. 40 రోజుల వైద్యానికి 50 లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు నిలబడలేదని కన్నవారి ఆవేదన. అత్తారింటికి పంపాల్సిన కూతుర్ని కాటికి పంపాల్సి వచ్చిందని కన్నీళ్ళు. పెళ్ళి చేసుకుని కళ్ళ ముందు కళకళలాడుతూ తిరగాల్సిన కూతురు కాటికి చేరడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో నివాసముండే పెండ్యా రవీందర్ కుమార్తె నర్మిషరెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏడేళ్ళ క్రితం అమెరికాలో ఉద్యోగం సంపాదించింది. ఈ నెలాఖరులో పెళ్ళి ఉండటంతో రెండునెలల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. 
 
పని మీద చెన్నై వెళ్ళి వచ్చిన తరువాత కరోనా బారిన పడింది. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం పడటంతో తిరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. నలభై రోజులకు పైగా మృత్యువుతో పోరాడి రెండురోజుల క్రితం మృతి చెందింది.
 
చికిత్స కోసం 50 లక్షలకు పైగా ఖర్చు చేశామనీ, అయినా ప్రాణం దక్కలేదని నరిష్మా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నాయి. ఒక్క క్షణం అప్రమత్తంగా లేకపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది.