శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 12 జులై 2020 (16:02 IST)

గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?.. కేంద్ర మంత్రి పరిశీలన

వైద్యులు రేయింబవళ్లు కరోనా బాధితులకు సేవలందిస్తున్నప్పటికీ ఇటీవల కొంతమంది నిర్లక్ష్యం కారణంగా కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్న హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం స్వయంగా పరిశీలించారు.

తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారు..? వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయ్..? నిశితంగా పరిశీలించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడారు. పలు మార్పులు చేర్పులకు సంబంధించి సూచనలు చేశారు. 
 
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మొర:
ఆస్పత్రి వద్ద కేంద్రమంత్రిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ మొర వినిపించుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. అలాగే వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రికి ఉద్యోగులు వినతిపత్రం అందించారు.
14 ఏళ్ళుగా పనిచేస్తున్నా 15వేల జీతం మాత్రమే ఇస్తున్నారని కొత్తగా వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 29వేల వేతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి డ్యూటీలకు వస్తున్నామన్నారు. మాకంటే జూనియర్లు కింద మేము పనిచేయలేమని, సమాన పని చేస్తున్నప్పుడు సమాన వేతనం చెల్లించాలని మీడియా ముఖంగా వారు డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించటం భారంగా మారిందని.. తమ వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకామని గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.