1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

ఆధ్యాత్మిక నగరిగా యాదాద్రి దివ్యక్షేత్రం నిర్మాణం

భాగ్యనగరానికి చేరువలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోన్న ఆలయాన్ని అద్భుతమైన దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి తొలి అడుగు పడి సరిగ్గా నేటికి అర్ధ దశాబ్దం అవుతోంది.

రెండు వేల ఎకరాల్లో ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా అన్ని హంగులతో... అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుమల స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. ఈ ఐదేళ్లలో ఆలయ రూపురేఖలనే మార్చివేసింది. 
 
ఆధారశిల నుంచి శిఖరం వరకు
రాజుల కాలంనాటి అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యం.. ఆధార శిల నుంచి శిఖరం వరకు కృష్ణ రాతిశిలా నిర్మాణాలు... దేశంలో... ఎక్కడా లేనివిధంగా అష్టభుజి ప్రాకార మండపాలు, సప్త గోపుర సముదాయం, భాగవత పురాణ ఇతిహాసాలు, మహా పురుషులు, దేవతామూర్తుల విగ్రహాలు, రాతి స్తంభాల ముఖ మండపాలు, పాంచ నరసింహులు కొలువై ఉన్న కొండ గుహ గర్భాలయం.. దాని ముఖ ద్వారానికి ప్రహ్లాద చరితం... పాంచ నరసింహుల రాతి బొమ్మలతో అనేక విశేషాల మేళవింపుతో పనులు తుది దశకు చేరుకున్నాయి.

బీజం అక్కడే పడింది తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని 2014 అక్టోబర్ 17న తొలిసారి సందర్శించారు కేసీఆర్. సాధారణంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని అందరూ భావించారు.

కానీ హెలికాప్టర్లో యాదాద్రి ఆలయ పరిసరాల్లోని కొండలు.. గుట్టలను పరిశీలించిన ఆయన... అప్పుడే యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు.