శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:37 IST)

"ఎఫ్-2" సీక్వెల్ కథ చెప్పిన హీరో వెంకీ... సంక్రాంతి తర్వాత ఓకే...

గత యేడాది సంక్రాంతికి వచ్చిన చిత్రాల్లో సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రం "ఎఫ్-2" (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). సీనియర్ హీరో వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ చిత్రం. ఇందులో వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. తమన్నా, హెబ్బా పటేల్‌ హీరోయిన్లు. అనిల్ రావిపూడ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీగా తెరకెక్కింది. 
 
అయితే, ఈ చిత్రం సీక్వెల్ తీయాలని వెంకీతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా లేదు. అందుకే వచ్చే యేడాది సంక్రాంతి తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేసుకోవాలని దర్శకుడు అనిల్‌కు హీరో వెంకటేష్ చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
 
ప్రస్తుతం కరోనా వైరస్ అత్యంత ప్రమాదకారిగా మారింది. సినీ సెలెబ్రిటీలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. అయనప్పటికీ.. కోవిడ్ నిబంధనలతో షూటింగులు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, పెద్ద హీరోలు మాత్రం సెట్స్‌కి రావడానికి జంకుతూనే వున్నారు. 
 
కరోనా మహమ్మారి ఏ రూపంలో వచ్చి అంటుకుంటుందో అన్న భయంతో షూటింగులను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు వెంకటేశ్ కూడా ఇప్పట్లో షూటింగులకు వచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు.
 
ఆయన నటిస్తున్న 'నారప్ప' చిత్రం షూటింగ్ చాలావరకు లాక్డౌన్‌కి ముందు అవుట్ డోర్‌లో జరిగింది. అయితే, లాక్డౌన్ రావడంతో ఎక్కడి షూటింగ్ అక్కడ ఆగిపోయింది. ఇక ఇప్పట్లో ఈ చిత్రం షూటింగును ప్రారంభించడానికి వెంకటేశ్ సంసిద్దంగా లేరని తెలుస్తోంది. 
 
అసలు ఈ ఏడాది చివరి వరకు సెట్స్‌కి వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకుని, యూనిట్‌కి ఆ విషయం చెప్పేశారని కూడా అంటున్నారు. అందుకే ఎఫ్-2 సీక్వెల్ కూడా వచ్చే యేడాది సంక్రాంతి తర్వాత చూసుకుందామని దర్శకుడు అనిల్ రావిపూడికి చెప్పారట.