శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (10:38 IST)

హీరో ప్రభాస్ బీపీఎల్ కాదు.. బాహుబలి : తెలంగాణ సర్కారు

హీరో ప్రభాస్‌కు ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. తన గెస్ట్ హౌజ్‌ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై ఆయన కోర్టు మెట్లెక్కారు. ఈ సందర్భంగా "ప్రభాస్ బీపీఎల్ (బిలో పావర్టీ లైన్ - దారిద్ర్య రేఖకు దిగువున) వ్యక్తికాదనీ, బాహుబలి" అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరపు అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
తన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వేనెంబర్‌ 5/3లోని 2083 గజాల స్థలాన్ని 2005, 2006లో బి.వైష్ణవి రెడ్డి, రవీందర్‌ రెడ్డిల నుంచి ప్రభాస్‌ కొనుగోలు చేశారన్నారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. క్రమబద్ధీకరణ కోరుతూ ఫీజును కూడా చెల్లించారని గుర్తుచేశారు. 
 
దీనికి ప్రభుత్వ తరపున స్పెషల్ జీపీ శరత్ కుమార్ స్పందిస్తూ, 'హీరో ప్రభాస్‌ భూమి క్రమబద్ధీకరించడానికి ఆయనేమీ నిరుపేద (బీపీఎల్‌) కాదు. ఆయన బాహుబలి. స్థలం క్రమబద్ధీకరణకు ఆయన చేసిన దరఖాస్తును 2015లో తిరస్కరించాం. పైగా ఆ భూములు ప్రభుత్వానివని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది' అని హైకోర్టుకు నివేదించారు.