1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (11:05 IST)

గుట్కా అక్రమ రవాణా కేసులో టాలీవుడ్ నటుడు అరెస్టు!

గుట్కా అక్రమ రవాణా కేసులో నటుడు సచిన్ జోషిని హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ హీరో నిషేధిత గుట్కాతోపాటు గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్ నగర పోలీసులు... ముంబైకు చేరుకుని సచిన్ జోషిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇటీవల హైదరాబాద్ నగరంలో భారీ మొత్తం గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులోని నిందితులను విచారించగా, ఈ యువ హీరోకు సంబంధాలు ఉన్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు... సచిన్ జోషిపై నిఘా పెంచారు. తమ నిఘానుంచి తప్పించుకోలేక పోయిన సచిన్ జోషిని పోలీసులు ముంబైలో అరెస్టు చేశారు.
 
ఆయనపై ఐపీసీ నిషేధిత మత్తు పదార్థాల రవాణా సెక్షన్లు 273, 336 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కోట్ల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లున్న బాక్సులను సచిన్ జోషి, హైదరాబాద్‌కు చేర్చే విషయంలో సహకరించాడని, ఆయనపై స్మగ్లింగ్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశామని తెలిపారు.
 
కాగా, బాలీవుడ్ చిత్రపరిశ్రమలో సంపన్న కుటుంబాల్లో సచిన్ జోషి కుటుంబం కూడా ఉంది. సచిన్ తండ్రికి గుట్కా వ్యాపారం ఉండగా, దీనిలో ఆయన వందల కోట్లు సంపాదించారు. ఇప్పుడు సచిన్‌ను అరెస్టు చేయడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. 
 
కాగా, నటుడిగా సచిన్ జోషి పలు తెలుగు చిత్రాల్లోనూ నటించాడన్నసంగతి తెలిసిందే. మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, జాక్ పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటి, అమావాస్ తదితర సినిమాల్లో నటించాడు.