1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 జులై 2023 (08:59 IST)

పరువునష్టం దావా కేసులో జీవిత రాజశేఖర్ దంపతులకు జైలుశిక్ష

jeevitha rajasekhar
ఓ పరువునష్టం దావా కేసులో సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత రాజశేఖర్‌లకు హైదరాబాద్ నగరంలోని నాంపల్లి కోర్టు ఒక యేడాది జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అలాగే, రూ.5 వేల అపరాధం కూడా విధించింది. తాజాగా వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
మెగాస్టార్ చిరంజీవి సొంతంగా హైదరాబాద్ నగరంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని గత 2011లో జీవిత, రాజశేఖర్లు ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆ దంపతులపై పరువు నష్టం దావా వేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైనా, ట్రస్టుపైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించిన మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా కోర్టుకు సమర్పించారు. 
 
దీనిపై సుధీర్ఘకాలంగా విచారణ జరిగిన తర్వాత మంగళవారం కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరికీ యేడాది పాటు జైలుశిక్షతో పాటు రూ.5 వేల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే, అపుడే జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరికి తాత్కాలికంగా ఊరట కలిగించింది. ఈ దంపతులకు కోర్టు జైలు శిక్ష విధించడం ఇపుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.