ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం
ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం తీసుకురావాలని నిర్ణయించినందుకు ప్రభుత్వానికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ లిఖితపూర్వక ప్రకటన నేడు విడుదలజేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్, పర్యాటక, సంస్కృతి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (AP FDC) లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
ఈ విషయంలో ఇప్పటికే, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు, ప్రముఖ నిర్మాతలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తెస్తూ, వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరంలో స్టూడియోల నిర్మాణం/ మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్మాతలు, కళాకారులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు గృహనిర్మాణం కోసం భూమి కేటాయింపు వంటి ప్రతిపాదనలను సమర్పించామని ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేగవంతమైన అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మా పూర్తి సహకారం మరియు మద్దతును అందించామని. ఇంకా, నంది అవార్డులను పునరుద్ధరించాలని మరియు పెండింగ్లో ఉన్న అవార్డులనుకూడా ఇవ్వాలని మేము అభ్యర్థించామని తెలియజేసారు.
కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో త్వరిత చర్య తీసుకోవాలని వినయపూరిత అభ్యర్ధనతో మేము ఎదురుచూస్తున్నామని, దీని ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు సాగుతుందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ (నిర్మాతలమండలి) తెలియజేసింది.