శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (09:39 IST)

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభం... దుర్యోధనుడి వేషంలో వచ్చిన బాలయ్య

తెలుగు సినిమా చరిత్రలో మరో సంచలనానికి నేడు... మార్చి 29, గురువారం సాక్షీభూతం కానుంది. తెలుగు జాతికి మరపురాని, మరువలేని మహానటుడు, ప్రజానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం వెండితెరకెక్కే సుముహ

తెలుగు సినిమా చరిత్రలో మరో సంచలనానికి నేడు... మార్చి 29, గురువారం సాక్షీభూతం కానుంది. తెలుగు జాతికి మరపురాని, మరువలేని మహానటుడు, ప్రజానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం వెండితెరకెక్కే సుముహూర్తం ఖరారైంది. గురువారం ఉదయం 9 గంటల 42 నిమిషాలకు హైదరాబాద్‌ నాచారంలోని రామకృష్ణా హార్టీకల్చరల్‌ సినీ స్టూడియోస్‌లో "యన్‌.టి.ఆర్" బయోపిక్‌ చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది.
 
'సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్ళు' అని నమ్మిన యన్టీఆర్‌ బయోపిక్‌ ప్రారంభోత్సవానికి ఆయనతో ఎంతో అనుబంధం ఉన్న భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై బాలకృష్ణను అభినందించారు. 
 
ముహూర్తపు షాట్ కోసం బాలకృష్ణ దుర్యోధనుడి వేషంలో వచ్చారు. కిరీటం లేని మేకప్‌తో వచ్చిన ఆయన, చుట్టూ తెల్లని శాలువా కప్పుకున్నప్పటికీ, ఆయన మేకప్‌ను చూస్తుంటే రారాజు వేషమే గుర్తొస్తోంది. ఇక తొలి షాట్ డైలాగ్, ఎన్టీఆర్ సినిమాల్లోనే అత్యంత ఫేమస్ అయిన "దాన వీర శూర కర్ణ" చిత్రంలోని "ఏమంటివి ఏమంటివి..." అన్న డైలాగ్‌ను చెప్పారు. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ నాటికి పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని బాలకృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది.