1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (11:12 IST)

ఎయిర్‌టెల్ వాడకండి.. మరో నెట్‌వర్క్‌కు మారండి... పూజా హెగ్డే పిలుపు

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకెళుతున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఈమె తాజాగా ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేనా.. 'ఎయిర్‌టెల్‌ వాడకండి.. మరో నెట్‌వర్క్‌కు మారండి' అంటూ ఆ సంస్థకు వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. 
 
వినియోగదారుల సేవల విషయంలో ఆ సంస్థ సరిగ్గా స్పందించడం లేదని, పదే పదే సమస్య వస్తోందని, అందువల్ల ఎయిర్‌‌టెల్ మొబైల్ వినియోగదారులంతా ఇతర నెట్‌వర్క్‌కు మారాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యంగా, ఎయిర్‌టెల్ నుంచి ఇతర టెలీకాం సంస్థకు చెందిన సిమ్‌ వాడి సమయాన్ని సేవ్ చేసుకోవాలని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులకు సూచన చేసింది. 
 
దీంతో వెంటనే స్పందించిన ఎయిర్‌టెల్ ప్రతినిధులు... ఆమెను సంప్రదించారు. పూజా హెగ్డేకు ఎదురవుతోన్న తమ సర్వీసు సమస్యలన్నీ పరిష్కరించారు. 'హాయ్ పూజా.. మీకు కలిగిన సేవల అంతరాయం పట్ల క్షమాపణలు చెబుతున్నాం. మీకు ఎదురవుతున్న సమస్య ఇప్పుడు పరిష్కారం అయిందని భావిస్తున్నాం' అని ఎయిర్‌టెల్ ఇండియా విభాగం ఓ ట్వీట్ చేసింది.