1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (12:43 IST)

ప్రభాస్ 35 లక్షల విరాళం - ఎల్బీ స్టేడియంలో అగ్ర హీరోల సాక్షిగా ఘనంగా డైరెక్టర్స్ డే వేడుకలు

Directores assocation team
Directores assocation team
దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4వ తేదీని డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు. ఈ ఈవెంట్ వివరాలను సోమవారం సాయంత్రం నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్ సైట్, డైరెక్టర్స్ డే ఈవెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘం సంక్షేమ నిధికి రెబెల్ స్టార్ ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు.
 
 అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - మే 4న దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డేను ఘనంగా నిర్వహించబోతున్నాం. మదర్స్ డే, ఫాదర్స్ డే ఉన్నట్లే డైరెక్టర్స్ డే కూడా అంతే పేరు తెచ్చుకోవాలి. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు మొత్తం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో మంచి పేరుంది. ఇప్పటిదాకా మనం డైరెక్టర్స్ డేను ఇండోర్ లో చిన్నగా చేసుకున్నాం. ఈసారి ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. హరీశ్ శంకర్, మారుతి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు బిజీగా ఉన్నా మన అసోసియేషన్ కార్యక్రమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అసోసియేషన్ మన కుటుంబం అని ప్రతి ఒక్కరు భావించడం వల్లే ఈ ఈవెంట్ కోసం అందరం కష్టపడుతున్నాం. డైరెక్టర్స్ డే వేడుకల్లో చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
 అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ - డైరెక్టర్స్ డేను ఇప్పటిదాకా మామూలుగా నిర్వహిస్తూ వచ్చాం కానీ ఈసారి డైరెక్టర్స్ అసోసియేషన్ కు కొత్త కమిటీ వచ్చాక చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశాం. మే 4న ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నాం. మన స్టార్స్, దర్శకుల సంఘం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ ఈవెంట్ చేస్తున్నాం. ఇందుకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
ఇంకా దర్శకులు రేలంగి నరసింహారావు, రాంప్రసాద్,  వీఎన్ ఆదిత్య, సముద్ర,  అనుదీప్ కేవి, వశిష్ట, ఎన్ శంకర్,  హరీశ్ శంకర్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్రభాస్, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, నాని, సాయి ధరమ్ తేజ్, అల్లరి నరేష్..ఇలా హీరోలంతా వస్తున్నారు. మిగతా స్టార్స్ ను కూడా కలుస్తాం. మనకు బ్లాక్ బస్టర్స్ తీయడం కొత్త కాదు, మే4న జరగబోయే ఈవెంట్ ను కూడా బ్లాక్ బస్టర్ చేద్దాం. అన్నారు.
 
దర్శకుడు మారుతి మాట్లాడుతూ - డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఈ ప్రెస్ మీట్ కు వస్తున్న టైమ్ లో ప్రభాస్ గారు కాల్ చేసి 35 లక్షల రూపాయలు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు విరాళంగా ఇమ్మని చెప్పారు. ఆయనకు మనందరి తరుపున కృతజ్ఞతలు చెబుతున్నా. మన అసోసియేషన్ ఇంకా బలంగా ముందుకు వెళ్తుందనే నమ్మకం కలుగుతోంది. అన్నారు.
 
రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ - నాకూ మీ అందరితో కలిసి ఆ వేదిక మీద కూర్చోవాలని ఉంది. నేను దర్శకుడిగా హిట్ సినిమా చేసిన తర్వాత కూర్చుంటాను. మీ అందరిలో ఎంతో ప్రతిభ ఉంది. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఆ ఘనతను మీరంతా తీసుకురావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. అన్నారు.
 
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్ సైట్ ను విజయేంద్రప్రసాద్, హరీశ్ శంకర్ లాంఛ్ చేయగా, డైరెక్టర్స్ డే లోగోను దర్శకుడు రేలంగి నరసింహారావు ఆవిష్కరించారు.