శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (10:46 IST)

డాడీ పరిస్థితి విషమంగా లేదు - ఆందోళన అక్కర్లేదు... శివాత్మిక

కరోనా వైరస్ టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్‌ను కాటేసింది. ప్రస్తుతం ఆయన కరోనా వైరస్‌తో పోరాటం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త క్రిటికల్‌గానేవుంది. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, టాలీవుడ్ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ తన ట్విట్టర్ ఖాతాలో గురువారం వెల్లడించింది. నాన్న కోవిడ్‌తో గట్టిగా పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు కోవిడ్ బారినపడిన విషయం తెల్సిందే. వీరిలో హీరో రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని రాజశేఖర్ ఇటీవలే వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో రాజశేఖర్ ఆరోగ్యంపై కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ట్వీట్ చేసింది. "కరోనాపై నాన్న చేస్తోన్న పోరాటం క్లిష్టంగా ఉంది.. అయినప్పటికీ ఆయన బాగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమే మమ్మల్ని కాపాడుతాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారు" అంటూ ట్వీట్ చేసింది. 
 
ఆ తర్వాత కాసేపటికే ఆమె మరో ట్వీట్ చేసింది. "మీ ప్రేమ ప్రార్థనల పట్ల కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. అయితే, ఓ విషయం తెలుసుకోండి.. ఆయన పరిస్థితి విషమంగా లేదు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది.. కోలుకుంటున్నారు. మీ ప్రార్థనలు కావాలి. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భయపడకండి.. అసత్యవార్తలను ప్రచారం చేయకండి" అంటూ ప్రాధేయపడింది.