శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (12:51 IST)

ఏది చూడాలో, చూడకూడదో వారికి తెల్సు.. అడల్ట్ షోనా.. హాట్ యాంకర్ ఫైర్

'జబర్దస్త్' కామెడీ షోకి ప్రేక్షకాదరణ ఎంతగా లభించిందో అన్నే వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. ఈ షోతో ఎంతోమంది పేరుప్రఖ్యాతులు సంపాదించుకుని ఇప్పుడు కెరీర్‌లో ఉన్నతస్థానంలో ఉన్నారు. వారిలో రష్మి కూడా ఒకరు. సినిమాలలో సహాయపాత్రలు వేసుకుంటున్న రష్మి ఈ షోలో యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుని, ఆపై పలు సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ఇక అప్పుడప్పుడూ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో తళుక్కున మెరుస్తున్న రష్మి తాజాగా తెలంగాణ మంచిర్యాలలో క్విక్కర్ బజార్ షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. 
 
ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రష్మి తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తూ, వివాదాస్పద సమస్యలపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తాను హీరో నందుతో కలిసి ఓ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నానని, ఆ సినిమాకు సంబంధించి వైజాగ్‌లో షూటింగ్ జరుగుతోందని చెప్పారు. మీరు తరచూ వివాదాల్లో నిలుస్తున్నారు, జబర్దస్త్‌లో కూడా ఇప్పుడు డబుల్ మీనింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి.. ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది కదా అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నతో చిందులు తొక్కిన రష్మి ఈ విధంగా సమాధానమిచ్చింది. 
 
‘కాంట్రవర్సీలు మేము కాదు చేస్తున్నది, మేము చాలా క్లీన్ అండ్ నీట్ ఎంటర్‌టైన్మెంట్ అందించాలని అనుకుంటున్నాము. కానీ దాన్ని మీరు చూసే విధానంలో ఉంటుంది. పైగా ప్రైమ్ టైమ్‌లో వచ్చే షోలు అడల్ట్స్ కోసం. వాళ్ళకంటూ సొంతంగా ఓ ఆలోచన ఉంటుంది. ఏది తీసుకోవాలి.. ఏది ఫిల్టర్ చేయాలో వారి బాగా తెలుసు. ఆ ఎంపిక మేము మీకు ఇస్తున్నాము. ఓటు హక్కుతో పాటుగా ఆలోచించే హక్కు కూడా మీకు ఉంది. కరెక్ట్‌గా ఆలోచించండి’ అంటూ తెలివైన జవాబుతో మీడియాకు షాక్ ఇచ్చింది రష్మి.