గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 31 మార్చి 2018 (13:04 IST)

''శ్రీదేవి'' అంత్యక్రియలు: సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశాలతో అలా జరిగిందట?

అతిలోకసుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లో తాను బసచేసిన హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోయింది. నటి శ్రీదేవి అంత్యక్రియ

అతిలోకసుందరి శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లో తాను బసచేసిన హోటల్ గది బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోయింది. నటి శ్రీదేవి అంత్యక్రియలు గత ఫిబ్రవరి 28న ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. ''పద్మశ్రీ'' అవార్డు గ్రహీత కావడంతోనే ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయనే ఊహాగానాలు అప్పట్లో వెలువడ్డాయి. 
 
అయితే ఇందులో ఎంతవరకు నిజముందంటే? మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ లాంఛనాలతో శ్రీదేవికి అంత్యక్రియలు జరిపించాలని ఆదేశించినట్టు సమాచార హక్కు చట్టం కింద అనిల్ గల్‌గలి అనే వ్యక్తికి ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్ సమాధానమిచ్చింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి ఈ ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్ వస్తుంది.
 
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినప్పుడు పార్ధివదేహంపై త్రివర్ణ పతాకం కప్పి, 21 సార్లు గన్‌సెల్యూట్ చేస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపే విషయంలో విచక్షణాధికారం కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ, దానిపై నిర్ణయం తీసుకునే అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటాయి. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే, విపాసనా గురు సత్యనారాయణ్ గోయెంకా తదితరులకు గతంలో ప్రభుత్వ లాంఛనాలతోనే అంత్యక్రియలు జరిపారు. ఇదే తరహాలోనే ప్రస్తుతం శ్రీదేవికి కూడా అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. 
 
గత ఆరేళ్లలో మొత్తం 41 మందికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. ఫిబ్రవరి 25న శ్రీదేవి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని మహారాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం వెల్లడించింది.