శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:52 IST)

జూలు విదుల్చుతున్న హైదరాబాద్ పోలీసులు.. నాగశౌర్యకు జరిమానా... ఎందుకు?

హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు తనయులు, సినీ సెలెబ్రిటీలు అని కూడా చూడటం లేదు. మొన్నటికిమొన్న వైకాపా ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇపుడు ఓ యువ నటుడుకి అపరాధం విధించారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టాలీవుడ్‌లో యువ నటుడు నాగశౌర్య. ఈయనకు పోలీసులు జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారులో ప్రయాణిస్తున్నందుకు ఈ అపరాధం విధించారు. నాగశౌర్య కారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి వెళ్తుండగా పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్.ఐ. రవి నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేసి జరిమానా వేశారు. 
 
కారులో ఉన్న మనిషి కనిపించకుండా.. కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్‌లను పెట్టుకోవడం సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్-2012 ఉల్లంఘన కిందికి వస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడం తప్పనిసరి. 
 
ఇటీవలే ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు పోలీసులు జరిమానా విధించిన విషయం తెలిసిందే. నగరంలోని మూసాపేట్‌ శ్రీరాములు థియేటర్‌ వద్ద వర్మ తన సహదర్శకులతో కలిసి బైక్‌పై ట్రిపుల్‌ రైడ్‌ చేశారు. రాంగోపాల్‌వర్మ ట్రిపుల్‌ డ్రైవింగ్‌ వ్యవహారంపై స్పందించిన పోలీసులు ట్రిపుల్‌ రైడింగ్‌, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడంతో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘన కింద వర్మకు రూ.1350 జరిమానా విధించారు.