1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (12:19 IST)

పవన్ ఏం చేసినా వాళ్ళ అమ్మ - అన్నయ్యకే చెప్పడు.. కల్యాణ్‌గారికి స్క్రిప్ట్‌లా?: త్రివిక్రమ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‍‌కు తాను రాజకీయ స్క్రిప్టులు రాసిస్తున్నట్టు వచ్చిన వార్తలపై టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించారు. తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమే. ఇది మాత్రమే నిజం. ఆయన ఏం చేసినా వాళ్ళ అన్నయ్యకు, వాళ్ళ అమ్మకు కూడా చెప్పడు. అందరూ తెల్లారిన తర్వాత పేపర్‌లో చదువుకోవడమే. అలాంటి ఆయనకు నేనేం సలహాలు ఇస్తానండి. మరి అమాయకంగా అడుగుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.
 
ఇకపోతే, పవన్ రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. స్క్రిప్టు నాదేనంటూ భలే బోనస్ ఇచ్చేస్తున్నారు నాకు. ఒక సినిమాకు కథ రాయడానికే నాకు సంవత్సరం పడుతుంది. ఇక ఆయనకు స్క్రిప్టులు ఎక్కడ రాస్తాను. రాజకీయాలకు, నాకు సంబంధం లేదు. నేను ఎవరికీ సలహాలు ఇవ్వను. ఇంకా నా గురించి చెప్పాలంటే.. నేను పేపర్‌ కూడా చదవను. న్యూస్‌ ఛానల్స్‌ చూడను అని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. 
 
ఇకపోతే, తాను దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ సినిమా షూటింగు చివరిదశలో ఉండగా హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ వార్త తెలియగానే నేను .. నిర్మాత షాక్ అయ్యాం. ఎన్టీఆర్ కోలుకోవడానికి సమయం పడుతుంది గనుక, ఆయనను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాం. సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయలేక పోతున్నాము గనుక, వేసవిలో విడుదల చేసుకుందాములే అని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. 
 
కానీ,అంత్యక్రియలు ముగిసిన మరుసటి రోజున ఎన్టీఆర్ నుంచి కాల్ వచ్చింది. ముందుగా అనుకున్న ప్రకారం సినిమాను రిలీజ్ చేయవలసిందే.. షూటింగును మొదలుపెట్టండి అన్నాడు. ఆయన అంకితభావానికి మేము ఆశ్చర్యపోయాం. మర్నాడు నుంచే షూటింగ్ స్టార్ట్ చేశాం. అందుకే చెప్పిన సమయానికి సినిమా మీ ముందుకు వస్తోంది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ వివరించారు.