శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 3 మే 2018 (11:41 IST)

ప్రకృతి విలయం : ఆంధ్రాలో పిడుగులు... రాజస్థాన్‌లో ఇసుక తుఫాను

ప్రకృతి విలయం.. ముంచుకొస్తున్న మృత్యువు ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల వాసులు ప్రత్యక్షంగా చూశారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో చూసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులు పడ్డాయి. అలాగ

ప్రకృతి విలయం.. ముంచుకొస్తున్న మృత్యువు ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల వాసులు ప్రత్యక్షంగా చూశారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో చూసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులు పడ్డాయి. అలాగే, ఈశాన్య రాజస్థాన్‌ను ఇసుక తుఫాను కమ్మేసింది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో దాదాపు 100 మందికి పైగా మృత్యువాతపడ్డారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఈ యేడాది పిడుగు పోట్లు అధికమయ్యాయి. వేసవి సీజన్‌ ఆరంభం నుంచి ఇప్పటివరకూ రోజూ ఏదో ఒక చోట పిడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ యేడాది మార్చి 16వ తేదీ నుంచి మే ఒకటి వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏకంగా 1,40,982 పిడుగులు పడ్డాయి. వీటి కారణంగా దాదాపు 39 మంది వరకు చనిపోయినట్టు సమాచారం.
 
ఇకపోతే, రాజస్థాన్ రాష్ట్రాన్ని ఇసుక తుఫాను ముంచేసింది. ఆకాశాన్ని దుమ్ము, ధూళి కమ్మేసింది. తీవ్రమైన గాలులతోపాటు దుమ్ము ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మే 2వ తేదీ బుధవారం అర్థరాత్రి తర్వాత రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్, ధోల్‌పూర్, అల్వార్, శ్రీగంగానగర్ జిల్లాల్లో ఇసుక తుఫాన్ వణికించింది. పెద్ద ఎత్తున ఇసుక ఇళ్లలోకి వచ్చింది. రోడ్లపై వాహనాల్లో వెళ్లే వారికి ముందు, వెనుక ఏమీ కనిపించలేదు. గాలులతోపాటు ఇసుక వచ్చి పడుతుండటంతో ప్రమాదాలు జరిగాయి.
 
తీవ్రమైన గాలులకు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. ఇసుక తుఫాన్ ధాటికి భరత్‌పూర్ ఒక్క జిల్లాలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్, నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్‌మెంట్లలోకి కూడా దుమ్ము వచ్చి చేరింది. చిన్న చిన్న ఇళ్లు అయితే మట్టికొట్టుకుపోయాయి. హాటళ్లు, చిరు వ్యాపారులు అయితే ఈ ఇసుక తుఫాన్ దెబ్బకి తీవ్రంగా నష్టపోయారు. ఈ తుఫాను దాటికి 22 మంది వరకు చనిపోగా, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.