గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 7 మే 2018 (08:55 IST)

మేజర్లు అలా కూడా ఉండొచ్చు : తుషార కేసులో సుప్రీంకోర్టు

మైనార్టీ తీరిన యువతీయువకుల (మేజర్లు) జంట వివాహం చేసుకోకపోయినప్పటికీ కలిసివుండొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మేజర్లుగా ఉండే జంట కలిసివుండే హక్కు ఉందని తెలిపింది.

మైనార్టీ తీరిన యువతీయువకుల (మేజర్లు) జంట వివాహం చేసుకోకపోయినప్పటికీ కలిసివుండొచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మేజర్లుగా ఉండే జంట కలిసివుండే హక్కు ఉందని తెలిపింది. సహజీవనాన్ని ప్రస్తుతం చట్టసభలూ గుర్తిస్తున్నాయని, గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టం 2005లోని సెక్షన్లలోనూ ఈ ప్రస్తావన ఉందని వివరించింది.
 
కేరళకు చెందిన తుషార అనే యువతిని నందకుమార్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. అయితే, చట్టబద్ధంగా సరిపడ వయసు లేదన్న కారణంగా తనకు తుషారతో జరిగిన పెళ్లిని కేరళ హైకోర్టు రద్దు చేసింది. పైగా, తుషారతో జరిగిన వివాహాన్ని రద్దు చేసిన కేరళ హైకోర్టు తుషారను తండ్రి కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ తీర్పును సవాలు చేస్తూ తుషారను వివాహం చేసుకున్న నందకుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌ విచారణ చేపట్టిన జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ల ధర్మాసనం.. 'నందకుమార్‌, తుషారలు హిందువులు. వారి పెళ్లి సమయానికి చట్టప్రకారం సరిపడా వయసు లేదు. అయినా 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం వారిది రద్దు చేయదగిన పెళ్లి కాదు' అని పేర్కొంది. 
 
అదేసమయంలో నందకుమార్‌, తుషారలు మేజర్లని.. వారు పెళ్లి బంధంతో ఒక్కటవ్వకపోయినప్పటికీ వారికి కలిసి జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కేరళ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన ధర్మాసనం తుషారకు ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యే ఆస్కారం ఉంది. 
 
కాగా, నందకుమార్‌ ఈ నెల 30కి 21వ సంవత్సరంలోకి అడుగుపెడతాడు. బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం మగవారికి 21, ఆడవారికి 18 ఏళ్లు నిండితేనే పెళ్లికి అర్హులు. దీన్ని ఆధారంగా చేసుకున్న తుషార తండ్రి కోర్టులో పిటిషన్ వేయగా, దాన్ని కోర్టు కొట్టివేసింది.