గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (17:39 IST)

రంగంలోకి దిగిన చంద్రబాబు… ఏపీ పొలిటికల్ సీన్ ఢిల్లీకి షిఫ్ట్ (వీడియో)

హస్తిన వేదికగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన హోదాపై పోరుకు శ్రీకారం చుట్టారు. విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించా

హస్తిన వేదికగా స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన హోదాపై పోరుకు శ్రీకారం చుట్టారు. విభజన హామీలను నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్న ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళ, బుధవారాలు అక్కడే ఉండే భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీల నేతలకు వివరించి… అవిశ్వాసానికి అండగా నిలవాలని కోరారు. 
 
హోదా అంశంపై ఏపీలో వాడివేడీ వ్యవహారం జరుగుతున్న సమయంలోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కాకరేపుతోంది. తన ఢిల్లీ టూర్ రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేపడుతున్నామనే సంకేతాలు పంపేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తుండటంతో బాబూ ఢిల్లీ టూర్ రాజకీయం ఆసక్తిగా మారింది. 
 
హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే చంద్రబాబు ఢిల్లీ వచ్చారని టీడీపీ నేతలు, ఎంపీలు చెపుతున్నప్పటికీ పర్యటన వెనుక ప్రయోజనాలు వేరేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అదేసమయంలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీ తెరవెనుక డ్రామాలాడుతుందంటూ టీడీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న తరుణంలో పార్లమెంట్‌లోని వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లను చంద్రబాబు స్వయంగా కలుస్తున్నారు. 
 
రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చడం లేదో చెప్పడంతో పాటు రాష్ట్ర ఇబ్బందులను వివరిస్తూ బుక్‌లెట్లను వివిధ పార్టీల నేతలకు పంపిణీ చేస్తున్నారు. తొలిరోజున అనేక మంది నేతలను ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే కలుసుకున్నారు. ముఖ్యంగా, సీనియర్ నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు టీఎంసీ ఎంపీలను ఆయన కుసుకున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలను కూడా ఆయన కలుసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలు, ప్రస్తుత టీడీపీ వైఖరి, ఎన్డీఏ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో వివరించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆయన వివరించారు. పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు చేసి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీతో ఇకపై ఎటువంటి సంబంధాలు ఉండవన్న విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేశారు. 
 
తన పర్యటన పూర్తిగా రాష్ట్ర విభజన అంశాలపైనేనని, ఎటువంటి రాజకీయాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. జాతీయ రాజకీయాలు, ఇతర అంశాలపై మాట్లాడేందుకు సీఎం విముఖత వ్యక్తం చేశారు. వైసీపీ, బీజేపీ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, అవినీతి పార్టీ అయిన వైసీపీతో కొనసాగాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నందునే తాము ఎన్డీఏ నుంచి బయటికి వచ్చామని చంద్రబాబు చెప్పారు. పీఎంవోను వైసీపీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.