గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 28 మార్చి 2018 (12:28 IST)

రహస్యంగా ఎందుకు కలుస్తున్నారు? టీడీపీ ఎంపీలకు చంద్రబాబు చీవాట్లు

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీవాట్లు పెట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలు రహస్యంగా కలుస్తున్నారనే ప్రచారం జ

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీవాట్లు పెట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వంటి కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలు రహస్యంగా కలుస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ విషయం మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
 
ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు వెళ్లినప్పుడు అక్కడున్న ఎంపీలు సహకరించడం లేదంటూ అఖిల సంఘాల సమావేశంలో కొందరు ప్రస్తావించిన విషయాన్ని కూడా బుధవారం ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్‌లో గుర్తు చేసి, ఎంపీలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీకి వచ్చిన తెలుగువారికి సహకరించడం ఎంపీల బాధ్యతని గుర్తుచేశారు. ఏపీ భవన్‌ను సమన్వయ వేదికగా వినియోగించుకోవాలని సూచించిన ఆయన, ఏ ఎంపీ కూడా కేంద్రమంత్రులను రహస్యంగా కలుసుకోవద్దని ఆదేశించారు.
 
తాను ఏ విషయంలోనూ తొందరపడనని... నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయనని స్పష్టంచేశారు. తన ఇమేజిని, పార్టీ ఇమేజిని దెబ్బతీసే చర్యలను సహించేది లేదన్నారు. రహస్యంగా ఎవరితో మంతనాలు వద్దని... తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుతప్పే అని ఎంపీలతో చంద్రబాబు అన్నారు. ఐదు కోట్ల ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని ఆయన ఎంపీలకు తెలిపారు. తాను జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నానని... సంక్షోభాలను సమర్ధంగా అధిగమించానని చెప్పారు.
 
సర్కారియా కమిషన్ సిఫారసులు అమలు చేయించింది టీడీపీనే అని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునర్నిర్వచించింది టీడీపీయే అని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ప్రజల హక్కులను కాపాడటంలో వెనుకంజ వేసేది లేదన్నారు. అంతేకాకుండా, మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించాలని.. మరింత కష్టపడటం ద్వారా నిరసనలు తెలపాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.